Monday, 19 December 2016

ఏబదియొకటవ అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఏబదియొకటవ అధ్యాయము

సత్చరిత్రములోని 52, 53 అధ్యాయములిందు 51వ అధ్యాయముగా పరిగణించవలెను.

తుదిపలుకు

ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమడ్ పంతు ఉపసంహారవాక్యములు వ్రాసెను. పీఠికతో విషయసూచిక నిచ్చునట్లు వాగ్దానము చేసెను. కాని యది హేమడ్ పంతు కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బి. వి. దేవు (ఠాణా వాసి, ఉద్యోగమును విరమించుకొనిన మామలతదారు) కూర్చెను. ప్రతి అధ్యాయప్రారంభమున దానిలోని యంశములను ఇచ్చుటచే విషయసూచిక యనవసరము. కాబట్టి దీనినే తుదిపలుకుగా భావించెదము. ఈ అధ్యాయమును సవరించుటకు, ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసియున్నట్లు కనబడలేదు. అచ్చటచ్చట చేతి వ్రాతను బోల్చుకొనుటగూడ కష్టముగా నుండెను. కాని యదంతయు నున్నదున్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్యవిషయములు ఈ దిగువ క్లుప్తముగా జెప్పబడినవి.

సద్గురు సాయియొక్క గొప్పదనము

శ్రీ సాయి సమర్థునకు సాష్ఠాంగనమస్కారము చేసి వారి యాశ్రయమును పొందెదము. వారు జీవజంతువులయందును, జీవములేని వస్తువులయందు కూడ వ్యాపించియున్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మస్వరూపమువరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగాగలవాని యన్నిటియందు వ్యాపించియున్నారు. జీవరాశియందంతటను కూడ వ్యాపించియున్నారు. భక్తులందరు వారికి సమానమే. వారికి మానావమానములు లేవు. వారికిష్టమైనవి యయిష్టమయినవియు లేవు. వారినే జ్ఞప్తియందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటిని నెరవేర్చి మనము జీవితపరమావధిని పొందునట్లుచేసెదరు.

ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము. విషయసుఖములనెడు కెరటములు దురాలోచలనే ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్లను కూడ విరుగగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము, అసూయలను మొసళ్లు నిర్భయముగా సంచరించును. అచట నేను, నాది యను సుడిగుండములును, ఇతర సంషయములును గిర్రున తిరుగుచుండును. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేప లచట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికి సాయి సద్గురువు దానికి అగస్త్యునివంటి వాడు (నాశనముచేయువాడు). సాయిభక్తులకు దానివల్ల భయమేమియుండదు. ఈమహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావవంటి వారు. వారు మనలను సురక్షితముగ దాటించెదరు.

ప్రార్థన

మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగనమస్కారము చేసి వారి పాదములు బట్టుకొని సర్వజనులకొరకు ఈ క్రింది ప్రార్థనము చేసెదము. మా మనస్సు అటునిటు సంచారము చేయకుండు గాక. నీవు దప్ప మరేమియు కోరకుండు గాక. ఈ సత్ చరిత్రము ప్రతి గృహమందుండు గాక. దీనిని ప్రతినిత్యము పారాయణ చేసెదెముగాక. ఎవరయితే దీనిని నిత్యము పారాయణ చేసెదరో వారి యాపదలు తొలగిపోవుగాక.

ఫలశ్రుతి

ఈ గ్రంథమును పారాయణ చేసినచో గలుగు ఫలితమునుగూర్చి కొంచెము చెప్పుదుము. పవిత్రగోదావరిలో స్నానము చేసి, షిరిడీలో సమాధిని దర్శించి, సాయి సత్ చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము. నీ విట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధకలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయు చున్నచో నీ పాపములన్నియు నశించును. జననమరణములనే చక్రమునుండి తప్పించుకొనవలెనన్నచో సాయికథలను చదువుము. వాని నెల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనుము, వారి పాదములనే యాశ్రయింపుము; వానినే భక్తితో పూజింపుము. సాయికథలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో నందు క్రొత్తసంగతులను గ్రహించగలవు. వినువారిని పాపములనుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణస్వరూపుమునే ధ్యానించినచో క్రమముగా నది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మసాక్షాత్కారమును పొందుట బహుకష్టము. కాని నీవు సాయి సగుణస్వరూపముద్వారా పోయినచో నీప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్యశరణాగతి వేడినచో నతడు 'తాను' అనుదానిని పోగొట్టుకొని నది సముద్రములో గలియునట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో ననగా జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలలో నేదయిన యొక్క యవస్థలో వారియందు లీనమయినచో సంసారబంధమునుండి తప్పుకొందువు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోను, పూర్తినమ్మకముతోను పారాయణ చేసి వారము రోజులలో ముగింతురో, వారి యాపద లన్నియు నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధియగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలమాధారపడియున్నది. ఈ రెండును లేనిచో నెట్టి యనుభవమును కలుగదు. దీనిని గౌరవముతో పారాయణ చేసినచో, శ్రీ సాయి ప్రీతి చెందును. నీ యజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యముల నొసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో నది యపరిమితానందమును కలుగజేయును. ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరేదరో వారు దానిని జాగరూకతతో పారాయణ చేయవలయును. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో, సంతసముతో జన్మజన్మములవరకు మదిలో నుంచుకొనును. ఈ గ్రంధమును గురుపౌర్ణమినాడు (అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమినాడు) గోకులాష్టమినాడు, శ్రీ రామనవమినాడు, దసరానాడు (అనగా బాబా పుణ్యతిథినాడు) ఇంటివద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసినయెడల వారల కోరిక లన్నియును నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మినయెడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసినయెడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు. అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నియు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును.

ఓ ప్రియమైన భక్తులారా! పాఠకులారా! శ్రోతలారా!

మీకు కూడ మేము నమస్కరించి మీ కొక మనవి చేయుచున్నాము. ఎవరి కథలను ప్రతిరోజు, ప్రతినెల, మీరు పారాయణ చేసితిరో వారిని మరువవద్దు. ఈ కథల నెంత తీవ్రముగా చదివెదరో, వినెదరో - అంత తీవ్రముగా మీకు ధైర్యము, ప్రోత్సాహము, సాయిబాబా కలుగచేసి, మీచే సేవ చేయించి, మీ కుపయుక్తముగా నుండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు, చదువరులును సహకరించవలెను. ఒండొరులు సహాయము చేసికొని సుఖపడవలెను.

ప్రసాద యాచనము

దీనిని సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. ఈ దిగువ కారుణ్యమును జూపుమని వారిని వేడెదము. దీనిని చదువువారును, భక్తులును హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక! సాయి సగుణస్వరూపము వారి నేత్రములందు నాటిపోవును గాక! వారు శ్రీ సాయిని సర్వజీవములయందు చూచెదరు గాక! తథాస్తు.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
శ్రీ సాయిసత్చరిత్రము సర్వము సంపూర్ణము.

।।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।।
।।శుభం భవతు।। 

ఏబదియవ అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఏబదియవ అధ్యాయము

1. కాకాసాహెబు దీక్షిత్ 2. టెంబెస్వామి 3. బాలారామ్ ధురంధర్ కథలు.

సత్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుట జరిగినది. కారణము అందులోని యితివృత్తముగూడ నదియే కనుక. సత్ చరిత్రలోని 51వ అధ్యాయ మిచ్చట 50వ అధ్యాయముగా పరిగణించవలెను.

తొలిపలుకు

భక్తుల కాశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక! వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు. మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయీ! మాయందు కనికరించుము. మమ్ము కటాక్షింపుము. చందనవృక్షములు మలయపర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును గురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంతఋతువునందు పుష్పములు వికసించి వానితో దేవుని పూజ చేయుటకు వీలు కలుగ జేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులును పవిత్రములు.

కాకాసాహెబు దీక్షిత్ (1864 - 1926)

మధ్యపరగణాలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణకుటుంబములో హరిసీతారామ్ ఉరఫ్ కాకాసాహెబు దీక్షిత్ జన్మించెను. ప్రాథమికవిద్యను ఖాండ్వాలో హింగన్ ఘాట్ లలో పూర్తి చేసెను, నాగపూరులో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి విల్సన్, ఎల్ఫిన్ స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యెను. న్యాయవాది పరీక్షలో కూడ ఉత్తీర్ణుడై లిటిల్ అండు కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంతన్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను.

1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబు దీక్షిత్ కు తెలియదు. అటుపిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లొనావ్లాలో నున్నప్పుడు, తన పాతస్నేహితుడగు నానాసాహెబు చాందోర్కర్ ను జూచెను. ఇద్దరును కలిసియేవో విషయములు మాట్లాడుకొనిరి. కాకాసాహెబు తాను లండనులో రైలుబండి ఎక్కుచుండగా కాలుజారిపడిన యపాయమునుగూర్చి వర్ణించెను. వందలకొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయెను. కాలు నొప్పియు, కుంటితనమును పోవలెనన్నచో, అతడు సద్గురువగు సాయివద్దకు పోవలెనని నానాసాహెబు సలహా నిచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను. సాయిబాబా "నా భక్తుని సప్తసముద్రముల మీద నుంచిగూడ పిచ్చుక కాలికి దారముకట్టి యీడ్చినట్లు లాగుకొని వచ్చెదను." అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే నాకర్షింపబడడనియు, వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతయు విని కాకాసాహెబు సంతసించి, "సాయిబాబా వద్దకుపోయి, వారిని దర్శించి కాలుయొక్క కుంటితనమునకంటె నా మనస్సుయొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన యానందమును కలుగజేయమని వేడుకొనెద"నని నానాసాహెబుతో చెప్పెను.

కొంతకాలము పిమ్మట కాకాసాహెబు అహమద్ నగర్ వెళ్ళెను. బొంబాయి లెజిస్ లేటివ్ కౌన్సిల్ లో వోట్లకై సర్దార్ కాకాసాహెబు మిరికర్ యింటిలో దిగెను. కాకాసాహెబు మిరీకర్ కొడుకు బాలాసాహెబు మిరీకర్. వీరు కోపర్ గాం కు మామలతుదారు. వీరు కూడ గుఱ్ఱపు ప్రదర్శన సందర్భములో అహమద్ నగరు వచ్చి యుండిరి. ఎలక్షను పూర్తియైన పిమ్మట కాకాసాహెబు షిరిడీకి పోవ నిశ్చయించు కొనెను. మిరీకర్ తండ్రీకొడుకులు వీరిని ఎవరివెంట షిరిడీకి పంపవలెనాయని యాలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. ఆహమద్ నగరులో నున్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యము బాగా లేదనియు, శ్యామాను తన భార్యతో గూడ రావలసినదనియు టెలిగ్రామ్ యిచ్చిరి. బాబా యాజ్ఞను పొంది శ్యామా అహమద్ నగరు చేరి తన అత్తగారికి కొంచెము నయముగా నున్నదని తెలిసికొనెను. మార్గములో గుఱ్ఱపు ప్రదర్శనమునకు బోవుచున్న నానాసాహెబు షాన్షె, అప్పాసాహెబు గద్రేయు శ్యామాను గలిసి, మిరీకరు ఇంటికి పోయి కాకాసాహెబు దీక్షితుని కలసి, వారిని షిరిడీకి తీసికొని వెళ్ళుమనిరి. కాకాసాహెబు దీక్షితుకు మిరీకరులకు శ్యామా అహమద్ నగరు వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామా మీరీకరులవద్దకు పోయెను. వారు శ్యామాకు కాకా సాహెబుదీక్షిత్ తో పరిచయము కలుగజేసిరి. శ్యామా కాకాసాహెబు దీక్షితుతో కోపర్ గాం కు ఆనాటి రాత్రి 10 గంటలకు రైలులో పోవలెనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే యొకవింత జరిగెను. బాబాయొక్క పెద్దపటము మీది తెరను బాలాసాహెబు మిరీకరు తీసి దానిని కాకాసాహెబు దీక్షితుకు చూపెను. కాకాసాహెబు శిరీడీకి పోయి యెవరినయితే దర్శించవలెనని నిశ్చయించుకొనెనో, వారే పటము రూపముగా నచట తనను ఆశీర్వదించుటకు సిద్ధముగా నున్నట్లు తెలిసి యతడు మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ పెద్దపటము మేఘశ్యామునిది. దానిపై యద్దముపగిలినందున నాతడు దానికింకొక యద్దము వేయుటకు మిరీకరులవద్దకు బంపెను. చేయవలసిన మరమ్మతు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబు శ్యామాలద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి.

10 గంటల లోపల స్టేషనుకు పోయి టిక్కెట్లు కొనిరి. బండి రాగా సెకండుక్లాసు క్రిక్కిరిసి యుండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబు స్నేహితుడు. అతడు వారిని ఫస్టుక్లాసులో కూర్చుంటబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్ గాం లో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగా నున్న నానాసాహెబు చాందోర్కరును జూచి మిక్కిలి యానందించిరి. కాకాసాహెబు, నానాసాహెబు కౌగలించుకొనిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా, కాకా సాహెబు మనస్సు కరగెను. కండ్లు ఆనందబాష్పములచే నిండెను. అత డానందముచే పొంగిపొరలుచుండెను. బాబా కూడ వారికొరకు తాము కనిపెట్టుకొని యున్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకే శ్యామాను బంపినట్లును తెలియజేసెను.

పిమ్మట కాకాసాహెబు బాబాతో నెన్నో సంవత్సరములు సంతోషముగా గడపెను. షిరిడీలో నొక వాడాను గట్టి దానినే తన నివాసస్థలముగా జేసికొనెను. అతడు బాబావల్ల పొందిన యనుభవములు లెక్కలేనన్ని గలవు. వాని నన్నిటిని ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదము. బాబా కాకాసాహెబుతో "అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయెదను" అన్న వాగ్దానము సత్యమైనది. 1926వ సంవత్సరము జూలై 5వ తేదీన అతడు హేమడ్ పంతుతో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడుచు, సాయిబాబా యందు మనస్సు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శిరమును హేమడ్ పంతు భుజముపై వాల్చి యే బాధయు లేక, యెట్టి చీకాకు పొందక ప్రాణములు విడిచెను.

శ్రీ టెంబె స్వామి

యోగులు ఒకరినొకరు అన్నదమ్ములవలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీవాసుదేవానంద సరస్వతి స్వాములవారు (టెంబె స్వామి) రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచారపరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగిభక్తుడు. నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని జూచుటకై కొంతమంది స్నేహితులతో పోయెను. వారు స్వాములవారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి, ఒక టెంకాయను దీసి పుండలీకరావు కిచ్చి యిట్లనిరి "దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము, నన్ను మరువ వద్దని వేడుము. నాయందు ప్రేమ చూపు మనుము." ఆయన, స్వాములు సాధారణముగా నితరులకు నమస్కరించరనియు కాని బాబా విషయమున ఇది యొక అపవాదమనియు చెప్పెను. పుండలీకరావు ఆ టెంకాయను, సమాచారమును షిరిడీకి దీసికొని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను. ఏలన బాబావలె రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెల్గించియే యుంచిరి.

ఒకనెల పిమ్మట పుండలీకరావు తదితరులును షిరిడీకి టెంకాయను దీసికొని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకు బొయిరి. పరిగడుపున నీళ్ళు తాగకూడదని కారపు అటుకులు ఉపాహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండుటచే టెంకాయను పగులగొట్టి దాని కోరును అందులో కలిపి యటుకులను రుచికరముగా జేసిరి. దురదృష్టముకొలది యా కొట్టిన టెంకాయ స్వాములవారు పుండలీకరావు కిచ్చినది. షిరిడీ చేరునప్పటికి పుండలీకరావుకీ విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయముచే వణకుచు సాయిబాబా వద్దకేగెను. టెంకాయ విషయ మప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహంచెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబెస్వామి పంపించిన టెంకాయను దెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా బట్టుకొని, తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుచు, పశ్చాత్తాపపడుచు, బాబాను క్షమాపణ వేడెను. దానికి బదు లింకొక టెంకాయను సమర్పించెదననెను. కాని బాబా యందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కెన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవు దింకొకటి లేదనియు చెప్పుచు నిరాకరించెను. ఇంకను బాబా యిట్లనెను. "ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీ కివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవేకర్తవని యనుకొనవేల? మంచి గాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని యనుకొనరాదు. గర్వాహంకారరహితుడవయి యుండుము. అప్పుడే నీ పరచింతన యభివృద్ధి పొందును." ఎంత చక్కని వేదాంతవిషయము బాబా బోధించెనో చూడుడు!

బాలారామ్ ధురంధర్ (1878 - 1925)

బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రుజులో పఠారెప్రభుజాతికి చెందిన బాలారామ్ ధురంధర్ యనువారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాలుగా నుండెను. ధురంధర్ కుటుంబములోని వారందరు భక్తులు, పవిత్రులు, భగవత్చింతన గలవారు. బాలారామ్ తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై యొక గ్రంథము వ్రాసెను. అటుపిమ్మట తన దృష్టిని మతము ఆధ్యాత్మిక విషయములవైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మవిద్య మొదలగువానిని చదివెను. అతడు పండరీపురవిఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయము కలిగెను. 6 నెలలకు పూర్వము తన సోదరులగు బాబుల్జీయును, వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి యనుభవములను బాలారామునకు ఇతరులకు చెప్పిరి. అందరు బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునుపే బాబా యిట్లు చెప్పెను. "ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు." ధురంధరసోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికి బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని, విస్మయమొందిరి. తక్కినవారందరు బాబాకు సాష్ఠాంగనమస్కారము చేసి వారితో మాట్లాడుచు కూర్చొని యుండిరి. బాబా వారితో నిట్లనెను. "వీరే నా దర్బారు జనులు. ఇంతకుముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని." బాబా ధురంధర సోదరులతో నిట్లనెను. "గత 60 తరముల నుండి మన మొండొరులము పరిచయము గలవారము". సోదరులందరు వినయవిధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకొని నిలచి, బాబాపాదములవైపు దృష్టినిగడించిరి. సాత్వికభావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతుక యార్చుకొని పోవుట, మొదలగునవి వారి మనస్సులను కరగించెను. వారంద రానందించిరి. భొజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారామ్ బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదము లొత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బాలారామున కిచ్చి పీల్చుమనెను. బాలారాము చిలుము పీల్చుట కలవాటుపడియుండలేదు. అయినప్పటికి దాని నందుకొని కష్షముతో బీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబా కందజేసెను. ఇదియే బాలారామునకు శుభసమయము. అతడు 6 సంవత్సరములనుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగ నయము చేసెను. అది అతనిని తిరిగి బాధపెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట నొకనాడు ఉబ్బసము మరల వచ్చెను. అదేరోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను.

వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడియుత్సవమును జూచుభాగ్యము ధురంధరసోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగని తేజస్సును ఆ మరుసటి ఉదయము కాకడ హారతి సమయమందు తేజో కాంతిని పాండురంగవిఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను.

బాలారామ్ ధురంధర్ మరాఠీ భాషలో తుకారామ్ జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడకమునుపే అతడు చనిపోయెను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాము జీవితము ప్రప్రథమమున వ్రాయబడెను. అందు వారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడియున్నది.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ఏబదియవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

నలుబదితొమ్మిదవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నలుబదితొమ్మిదవ అధ్యాయము

1. హరి కానోబా, 2. సోమదేవ స్వామి, 3. నానాసాహెబు చాందోర్కరు - కథలు

తొలిపలుకు

వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మావంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక ఊరకొనుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కాని సాయిబాబా సుగుణములను జూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులుగాని, బంధువులుగాని మనతో లేకున్నచో, మంచి పిండివంటలు కూడా రుచింపవు. కాని వారు మనతో నున్నచో ఆ పిండివంటలు మరింత రుచికరము లగును. సాయి లీలామృతము కూడ అట్టిదే. దీనిని మన మొంటరిగా తినలేము, స్నేహితులు, బంధువులు కలసినచో చాల బాగుగా నుండును.

ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి యిష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారకి సర్వస్యశరణాగతి యొనర్చి వారి యందే ధ్యానము నిలుపుట మాకర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దాక్షములకంటె తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట, తపస్సు కంటె మేలు. సద్గురుని ధ్యానించుట యన్నింటికంటె మేలయినది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు, వారి యాకారమును మనస్సున భావించుకొనుచు, వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో, వారికొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసారబంధమునుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో, సాయి తప్పనిసరిగ మనకు సహాయము చేయును. తుదకు మోక్షము నిచ్చును. ఇక నీయధ్యాయములోని కథలవైపు మరలుదము.

హరి కానోబా

హరి కానోబా యను బొంబాయి పెద్దమనుష్యుడొకడు తనస్నేహితులవల్ల, బంధువులవల్ల బాబాలీల లనేకములు వినెను, కాని నమ్మలేదు. కారణమేమన అతనిది సంశయస్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలెనని యతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారుపాగ యుండెను. అతని పాదములకు కొత్తచెప్పులుండెను. కొంతదూరమునుండి బాబాను చూచి బాబావద్దకు బోయి సాష్టాంగనమస్కారము చేయవలె ననుకొనెను. క్రొత్తచెప్పులెచ్చట నుంచవలెనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదుముందొక మూలన బెట్టి బాబా దర్శనమునకు బోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి, ఊదిని, ప్రసాదమును బాబాచేతి నుండి యందుకొని తిరిగివచ్చెను. మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పులకొరకు వెదకెను కాని నిష్ప్రయోజనమయ్యెను. చాలా చీకాకు పడుచు బసకు వచ్చెను.

అతడు స్నానము చేసి, పూజ చేసి, నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. కాని, తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను. భోజనానంతరము, చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తనవైపు వచ్చుట చూచెను.

ఆ కుర్రవాని చేతిలో నొక కర్రయుండెను. దాని చివరకు క్రొత్తచెప్పులజత వ్రేలాడుచుండెను. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చినవారితో అతడు బాబా తనను బంపెననియు, వీధిలో 'హరీ కా బేటా, జరీ కా పేటా' యని యరచుమనియు చెప్పెననెను. ఎవరయిన ఆ చెప్పులు తమవే యన్నచో నతని పేరు హరి యనియు, నతడు కానోబా కొడుకనియు, అతనితలపై జరీపాగా గలదా యను సంగతి పరీక్షించిన తరువాత చెప్పుల నిచ్చి వేయుమని చెప్పెననెను. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని, హరి కానోబా యాశ్చర్యానందములు పొందెను. కుర్రవానివద్దకు బోయి చెప్పులు తనవని రూఢి చేసెను. అతడు తన పేరు హరి యనియు, తాను కానోబా కుమారుడననియు తన తలపై ధరించు జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తిజెంది చెప్పుల నిచ్చివేసెను. హరి కానోబా మిక్కిలి యాశ్చర్యపడెను. తన జల్తారుపాగ యందరికి కనిపించవచ్చునుగాని, తన పేరు, తన తండ్రిపేరు బాబా కెట్లు దెలిసెను? అదియే షిరిడీకి మొదటిసారి తన రాక. అత డచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయమువల్ల నాతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగ నెరవేరెను, సంతోషముతో నింటికి పోయెను.

సోమదేవస్వామి

బాబాను పరీక్షించుటకై యింకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబు దీక్షిత్ తమ్ముడు భాయాజీ నాగపూరులో నివసించుచుండెను. 1906వ (౧౯౦౬) సంవత్సరములో హిమాలయములకు బోయినపుడు సోమదేవ స్వామి యను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో గలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసికొనిరి. ఐదు సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి భాయాజీ యింట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతనికి గట్టికోరిక గలిగెను. భాయాజీ వద్దనుంచి పరిచయము ఉత్తరమును దీసికొని షిరిడీకి పోయెను. మన్మాడు, కోపరగాం దాటిన పిమ్మట టాంగా చేసికొని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై రెండు పెద్ద జండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోను, వేర్వేరు జీవనపద్ధతులతోను, వేర్వేరు బాహ్యాలంకారములతోను ఉందురు. కాని యీ పై పై గుర్తులనుబట్టి యే యోగియొక్క గొప్పదనమును గనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంథాగా దోచెను. రెండు పతాకము లెగురుట చూడగనే తానిట్లనుకొనెను. "ఈ యోగి జండాలయందేల మక్కువ జూపవలెను? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తికొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది" అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని, షిరిడీకి పొవుట మానుకొన నిశ్చయించినట్లు తనతోనున్న యితర యాత్రికులకు జెప్పెను. వారతనితో నిట్లనిరి. "అట్లయిన ఇంత దూరము వచ్చితి వేల?" జండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో, షిరిడీలో రథము, పల్లకి, గుఱ్ఱము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు?" సోమదేవస్వామి గాభరపడి యిట్లనెను. "గుఱ్ఱములతోను, పల్లకీలతోను, జట్కాలతోను గల సాధువులను నేనెచ్చట జూచి యుండలేదు. అట్టి సాధువులను చూచుటకంటె తిరిగిపోవుటయే మేలు" అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్థమయ్యెను. తక్కిన తోడి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీ లోనికి బొమ్మనిరి. అట్టి వక్రాలోచనను మానుమనిరి. బాబా యా జండాలను కాని తక్కిన వస్తువులనుగాని ఆడంబరములనుగాని కీర్తినిగాని లక్ష్యపెట్టనివారని చెప్పిరి. అవన్నియు నలంకరించినవారు బాబా భక్తులేగాని ఆయనకేమి యవసరముగాని సంబంధముగాని లేదనిరి. వారి భక్తి ప్రేమలకొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు జేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువనుంచి బాబాను దర్శించగనే అతని మనస్సు కరగెను. అతని కండ్లు నీటితో నిండెను; గొంతుక యార్చుకొనిపోయెను. "ఎచ్చట మనస్సు శాంతించి యానందమును పొంది యాకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము" అని తన గురువు చెప్పినదానిని జ్ఞప్తికి దెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనముకొరకు దగ్గరకు పోగా "మా వేషము మా దగ్గరనే యుండనీ, నీ యింటికి నీవు పొమ్ము. తిరిగి మసీదుకు రావద్దు. ఎవరయితే మసీదుపై జండా నెగురవైచుచున్నారో యట్టివారి దర్శనము చేయనేల? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమయిన ఉండవద్దు" అనెను. ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించుచున్నాడని తెలిసికొనెను. అతడెంత సర్వజ్ఞుడు! తాను తెలివితక్కువవాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా కొందరిని కౌగిలించుకొనుట, కొందరిని యాశీర్వదించుట, కొందరిని యోదార్చుట, కొందరివైపు దాక్షిణ్యముతో జూచుట, కొందరివైపు చూచి నవ్వుట, ఊదీప్రసాదమును కొందరి కిచ్చుట, యిట్లు అందరిని ఆనందింపజేసి, సంతృప్తి పరచుట జూచి తన నొక్కరినే యేల యంత కఠినముగా జూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీక్షణముగా నాలోచించి బాబా చేయునదంతయు తన యంతరంగముననున్న దానితో సరిగా నుండెనని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకొని వృద్థిపొందుటకు యత్నింపవలెనని గ్రహించెను. బాబా కోపము మారురూపముతో నున్న యాశీర్వాదమే యనుకొనెను. కొన్నాళ్ళ పిమ్మట బాబాయందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను.

నానా సాహెబు చాందోర్కరు

ఈ అధ్యాయమును హేమండ్ పంతు నానాసాహెబు చాందోర్కరు కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబు మసీదులో మహాళ్సాపతి మొదలగువారితో కూర్చొని యుండగా, బీజీపూరునుండి ఒకమహమ్మదీయుడు కుటుంబముతో బాబాను జూచుటకు వచ్చెను. అతనితో గోషా స్త్రీ లుండుటచే నానాసాహెబు అచ్చటనుంచి లేవనెంచెను. కాని బాబా యాతని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసికొనిరి. అందులో నొక స్త్రీ ముసుగు దీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసికొనెను. నానాసాహెబు ఆమె ముఖసౌందర్యమును చూచి మరలమరల చూడగోరెను. నానాయొక్క చాంచల్యమును జూచి, స్త్రీలు వెళ్ళి పోయిన పిమ్మట, బాబా నానాతో నిట్లనెను. "నానా! అనవసరముగా చీకాకు పడుచుంటి వేల? ఇంద్రియములను వాని పనులను జేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగ జేసికొన గూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు గాన అందరిని చూచి సంతసించుట మన విధి. క్రమముగాను, మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరచియుండగా, వెనుక ద్వారము గుండా పోనేల? మన హృదయము స్వచ్ఛముగా నున్నంతవరకు, నేమియు దోషము లేదు. మనలో చెడ్డ యాలోచన లేనప్పుడితరులకు భయపడనేల? నేత్రములు వానిపని యవి నెరవేర్చు కొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేల?"

శ్యామా యచ్చటనే యుండెను. కాని బాబా చెప్పినదానిని గ్రహించలేక పోయెను. ఇంటికి పోవు దారిలో శ్యామా ఆ విషయమై నానా నడిగెను. ఆ చక్కని స్త్రీవైపు జూచి తాను పొందిన యా చంచలత్వమును గూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి యెట్లు సలహా నిచ్చెనో వివరించెను. బాబా చెప్పినదాని భావము నానా యిట్లు చెప్ప దొడంగెను. "మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరమును స్వాధీనమునం దుంచుకొనవలెను. దాని యోరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయములవైపు పరుగెత్తును. కాని, మనము వానివెంట పోరాదు. మనము ఆ విషయములను కోరగూడదు. క్రమముగాను, నెమ్మదిగాను, సాధన చేయుటవలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడగూడదు. కాని వానిని మనము పూర్తిగ స్వాధీనమం దుంచుకొనలేము. సమయానుకూలముగా వాని నణచి సరిగా నుంచుకొనుచుండవలెను. నేత్రములందమైనవానిని జూచుటకొరకే యివ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని, లజ్జకుగాని యవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా నింద్రియములను సులభముగాను, సహజముగాను స్వాధీనము చేసికొనవచ్చును. విషయము లనుభవించుటలో కూడ నీవు భగవంతుని జ్ఞప్తియందుంచుకొనెదవు. బాహ్యేంద్రియముల మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయములవైపు పరుగిడనిచ్చినచో, వానిపై అభిమాన ముండనిచ్చినచో, చావుపుట్టుకల చక్రమునశింపదు. ఇంద్రియవిషయములు హానికరమయినవి. వివేకము (అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట) సారథిగా, మనస్సును స్వాధీనమందుంచుకొన వలెను. ఇంద్రియముల నిచ్చవచ్చినట్లు సంచరింప జేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదమును చేర గలము. అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమైన యావాసము. అచటనుండి తిరిగి వచ్చుటలేదు."

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదితొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

నలుబదియెనిమదవ అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నలుబదియెనిమదవ అధ్యాయము

భక్తుల ఆపదలు బాపుట

1. షేవడే 2. సపత్నేకరుల కథలు

ఈ అధ్యాయము ప్రారంభించునప్పు డెవరో హేమడ్ పంతును "బాబా గురువా? లేక సద్గురువా?" యని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధాన మిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమడ్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు.

సద్గురుని లక్షణములు

ఎవరు మనకు వేదవేదాంతములను, షట్ శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాసనిశ్వాసములను బంధించెదరో, బ్రహ్మమును గూర్చి అందముగా నుపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయుమందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవితపరమావధిని బోధించగలరో కాని ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరయితే చక్కని సంభాషణలవల్ల మనకు ఇహపరసుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరాత్మసాక్షాత్కారమందు మన కభిరుచి కలుగునట్లు జేసెదరో యెవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తకజ్ఞానమేగాక ఆచరణయందనుభవము కూడ పొంది యున్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయముగ పొందని గురువు దానిని శిష్యుల కెట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందయినను శిష్యులనుండి సేవనుగాని ప్రతిఫలమునుగాని యాశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయ తలచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయేగాక తనతో సరిసమానముగా జూచును. సద్గురుని ముఖ్యలక్షణమేమన, వారు శాంతమున కునికిపట్టు. వారెన్నడు చాపల్యమునుగాని చికాకు గాని చెందరు, తమ పాండిత్యమునకు వారు గర్వించరు, ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే.

హేమడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును, సహవాసమును పొందెనని తలంచెను. బాబా యౌవనమందు కూడ ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని, స్నేహితులుగాని, యిల్లుగాని, ఎట్టి యాధారముగాని లేకుండెను. 18 ఏండ్ల వయస్సునుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకొనిరి. వారొంటరిగా, నిర్భయముగా నుండెడివారు. వారెల్లప్పుడాత్మానుసంధానమందు మునిగి యుండెడివారు. భక్తుల స్వచ్ఛమైన యభిమానమును జూచి వారి మేలుకొరకేవైన చేయుచుండెడివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి యుండెడివారు. వారు భౌతికశరీరముతో నున్నప్పుడు తమ భక్తులకు ఏ యనుభవముల నిచ్చుచుండిరో, యట్టివి వారు మహాసమాధిచెందిన పిమ్మటకూడ తమయందభిమానము గల భక్తులు అనుభవించుచున్నారు. అందుచే భక్తులు చేయవలసిన దేమన - భక్తివిశ్వాసములనెడు హృదయదీపమును సరిచేయవలెను. ప్రేమయను వత్తిని వెలిగించవలెను. ఎప్పుడిట్లు చేసెదరో, యప్పుడు జ్ఞానమనే జ్యోతి (ఆత్మ సాక్షాత్కారము) వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమలేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానమెవరికి అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తియుండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమితప్రేమ యుండవలెను. ప్రేమను మన మెట్లు పొగడగలము? ప్రతి వస్తువు దానియెదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమ యనునదే లేని యెడల చదువుటగాని, వినుటగాని, నేర్చుకొనుటగాని నిష్పలములు. ప్రేమ యనునది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా నొకటి తరువాత నింకొకటి వచ్చును. దేనినిగూర్చిగాని మిక్కిలి చింతించనిదే దానియందు మనకు ప్రేమ కలుగదు. యదార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అదియే ప్రేమ; అదే మోక్షమునకు మార్గము.

ఈ యధ్యాయములో చెప్పవలసిన ముఖ్యకథను పరిశీలించెదము. స్వచ్ఛమైన మనస్సుతో నెవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు బోయి వారి పాదములపై బడినచో, తుట్టతుద కతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథవలన విశదపడును.

షేవడే

షోలాపూర్ జిల్లా అక్కల్ కోట నివాసి సపత్నేకర్ న్యాయపరీక్షకు చదువుచుండెను. తోడి విద్యార్థి షేవడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడ గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా నున్నది లేనిది చూచుకొనుచుండిరి. ప్రశ్నోత్తరములవలన షేవడేకు ఏమియురానట్టు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగా చదువకపోయినను తనయందు సాయిబాబా కృపయుండుటచే ఉత్తీర్ణుడ నగుదునని చెప్పెను. అందుకు సపత్నేకర్ యాశ్చర్యపడెను. సాయిబాబా యెవరు? వారినేల యంత పొగడుచున్నావు? అని అడిగెను. అందులకు షేవడే యిట్లనెను. "షిరిడీ మసీదులో నొక ఫకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు. యోగులితరులున్నను, వారమోఘమైనవారు. పూర్వజన్మసుకృతముంటేనే గాని, మనము వారిని దర్శించలేము నేను పూర్తిగా వారినే నమ్మియున్నాను. వారు పలుకునది యెన్నడు అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక యుత్తీర్ణుడ నగుదునని వారు నన్ను ఆశీర్వదించియున్నారు. కనుక తప్పక వారి కృపచే చివరి పరీక్షయందుత్తీర్ణుడనయ్యెద"ననెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని, బాబాను కూడ వెక్కిరించెను.

సపత్నేకరు - భార్యాభర్తలు

సపత్నేకర్ న్యాయపరీక్షలో నుత్తీర్ణుడయ్యెను. అక్కల్ కోటలో వృత్తిని ప్రారంభించి, యచట న్యాయవాది యాయెను. పది సంవత్సరముల పిమ్మట అనగా, 1913లో వానికి గల యొకేకుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను. అందువలన అతని మనస్సు వికల మయ్యెను. పండరీపురం, గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థముపోయి, శాంతి పొందవలె ననుకొనెను. కాని యతనికి శాంతి లభించలేదు, వేదాంతము చదివెను గాని, యదికూడ సహాయపడలేదు. అంతలో షేవడే మాటలు, అతనికి బాబాయందుగల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తానుకూడ షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలె ననుకొనెను. తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరమునుండియే బాబా దర్శనముచేసి సంతసించెను. గొప్పభక్తితో బాబావద్దకేగి యొకటెంకాయ నచట బెట్టి, బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసెను. "బయటకు పొమ్ము" అని బాబా యరచెను. సపత్నేకర్ తలవంచుకొని కొంచెము వెనుకకు జరిగి యచట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకెవరి సలహాయైన తీసికొనుటకు యత్నించెను. కొందరు బాలాషింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబావద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి యదెవరిదని యడిగెను. దానిని ప్రేమించువారిదని బాబా చెప్పుచు సపత్నేకర్ వయిపు చూసెను. బాబా నవ్వగా నచటివారందరు నవ్విరి. బాలా ఆ నవ్వుయెక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచు సపత్నేకర్ ను దగ్గరగా జరిగి బాబా దర్శనము చేయుమనెను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా, బాబా తిరిగి వెడలి పొమ్మని యరచెను. సపత్నేకరుకేమి చేయవలెనో తోచకుండెను. అన్నదమ్ములిద్దరు చేతులు జోడించుకొని బాబాముందు కూర్చుండిరి. మసీదు ఖాళీచేయమని బాబా సపత్నేకర్ ను ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారముతో నిరాశ జెందిరి. బాబా యాజ్ఞను పాలించవలసి యుండుటచే సపత్నేకర్ షిరిడీ విడువవలసివచ్చెను. ఇంకొకసారి వచ్చినపుడైన దర్శనమివ్వవలెనని అతడు బాబాను వేడెను.

సపత్నేకర్ భార్య

ఒక సంవత్సరము గడచెను. కాని, యతని మనస్సు శాంతి పొందకుండెను. గాణగాపురము వెళ్ళెను కాని యశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాఢేగాం వెళ్ళెను; తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు రెండు దినములకు ముందు అతని భార్యకొక స్వప్న దృశ్యము గనపడెను. స్వప్నములో నామె నీళ్ళకొరకు కుండ పట్టుకొని లకడ్షాబావికి పోవుచుండెను. అచట నొక పకీరు తలకొక గుడ్డ కట్టుకొని, వేపచెట్టు మొదట కూర్చున్న వారు తనవద్దకు వచ్చి "ఓ అమ్మాయి! అనవసరముగా శ్రమపడెదవేల? నేను స్వచ్ఛజలముతో నీకుండ నింపెదను" అనెను. ఆమె పకీరుకు భయపడి, ఉత్తకుండతో వెనుకకు తిరిగి పోయెను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరచెను. ఆమె తన కలను భర్తకు జెప్పెను. అదియే శుభశకున మనుకొని యిద్దరు షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరునప్పటికి బాబా యక్కడ లేకుండెను. వారు లెండీతోటకు వెళ్ళియుండిరి. బాబా తిరిగి వచ్చువరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నములో తాను జూచిన ఫకీరుకు బాబాకు భేదమేమియు లేదనెను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచు, అచటనే కూరచుండెను. ఆమె యణకువ జూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఏదో నొక కథ చెప్పుటకు మొదలిడెను. "నా చేతులు, పొత్తి కడుపు, నడుము, చాల రోజులనుండి నొప్పి పెట్టుచున్నవి. నేననేకౌషధములు పుచ్చుకుంటిని, కాని నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవుటచే విసుగు జెందితిని. కాని నొప్పులన్నియు నిచట వెంటనే నిష్క్రమించుట కాశ్చర్యపడుచుంటిని" అనెను. పేరు చెప్పనప్పటికి ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో పోవుటచే నామె సంతసించెను.

సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసికొనెను. మరల బాబా బయటకు బొమ్మనెను. ఈ సారి యతడు మిక్కిలి పశ్చాత్తాపపడి యెక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి యెగతాళి చేసినదాని ప్రతిఫలమని గ్రహించి, దాని విరుగుడుకొరకు ప్రయత్నించుచుండెను. బాబా నొంటరిగా కలిసికొని వారిని క్షమాపణ కోరవలెనని యత్నించుచుండెను. అట్లే యొనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదాములపై బెట్టెను. బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపయి బెట్టెను. బాబా కాళ్ళనొత్తుచు సపత్నేకర్ అక్కడనే కుర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును బట్టుచుండెను. బాబా యొక కోమటిగూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితములో కష్టములన్నియు వర్ణించెను. అందులో వాని యొకేయొక కొడుకు మరణించిన సంగతి కూడ చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే యని సపత్నేకర్ మిక్కిలి యాశ్చర్యపడెను. బాబాకు తన విషయము లన్నియు దెలియుటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడందరి హృదయముల గ్రహించుననెను. ఈ యాలోచనలు మనస్సున మెదలుచుండగా బాబా ఆ గొల్లస్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు జూపించి యిట్లనెను. "వీడు తనకొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను జంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి యేడ్చుచున్నాడేల? అదే బిడ్డను వీనిభార్య గర్భములోనికి మరల దెచ్చెదను." ఈ మాటలతో బాబా యతని తలపై హస్తముంచి యోదార్చియిట్లనియె. "ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నా యందే నమ్మకముంచుము. నీ మనోభీష్టము నెరవేరును." సపత్నేకర్ మైమరచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయెను.

సపత్నేకర్ పూజాసామగ్రినమర్చుకొనినైవేద్యముతో మసీదుకు భార్యతో బోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారివద్ద ప్రసాదము పుచ్చుకొనుచుండెడివారు. ప్రజలు మసీదులో గుమిగూడి యుండెడివారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమవినయములతో నొక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి యుత్సవమును జూచెను. అందు బాబా పాండురంగనివలె ప్రకాశించెను.

ఆ మరుసటిదిన మింటికి పోవునప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ యిచ్చి తిరిగి యడిగినచో రెండవ రూపాయి లేదనక యివ్వచ్చునని సపత్నేకర్ యనుకొనెను. మసీదుకు బోయి ఒక రూపాయి దక్షిణ నివ్వగా బాబా యింకొక రూపాయ కూడ నడిగెను. బాబా వానిని ఆశీర్వదించి యిట్లనెను. "టెంకాయను దీసికొనుము. నీ భార్య చీరకొంగులో పెట్టుము. హాయిగా పొమ్ము, మనస్సునందెట్టి యాందోళనము నుంచకుము" అతడట్లే చేసెను. ఒక సంవత్సరములో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి, ఆ శిశువును బాబా పాదములపై బెట్టి యిట్లు ప్రార్థించిరి. "ఓ సాయీ! నీ బాకీ నెటుల తీర్చుకొనగలమో మాకు తోచకున్నది. కనుక మీకు సాష్టాంగనమస్కారము చేయుచుంటిమి. నిస్సహాయుల మగుటచే మమ్ముద్ధరించ వలసినది. ఇక మీదట మేము మీ పాదములనే మాశ్రయించెదముగాక. అనేకాలోచనలు, సంగతులు, స్వప్నావస్థలోను, జాగ్రదవస్థలోను మమ్ముల బాధించును. మా మనస్సులను నీ భజనవైపు మరల్చి మమ్ము రక్షింపుము."

కుమారునకు మురళీధర్ యను పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ యను నిద్దరు జన్మించిరి. బాబా మాటలు వృధాపోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి యక్షరాల జరుగునని కూడ నమ్మిరి.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదియెనిమదవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

నలుబదియేడవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నలుబదియేడవ అధ్యాయము

బాబాగారి స్మృతులు

వీరభద్రప్ప, చెన్నబసప్ప (పాము - కప్ప) కథ

గత అధ్యాయములో రెండు మేకల పూర్వవృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమున కూడ అట్టి పూర్వవృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు, చెన్న బసప్ప యొక్కయు కథలు చెప్పుదుము.

తొలిపలుకు

శ్రీసాయి ముఖము పావనమైనది. ఒక్కసారి వారివైపు దృష్టి నిగిడించినచో, గత యెన్నో జన్మల విచారమును నశింపజేసి యెంతో పుణ్యము ప్రాప్తించినటుల జేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో, మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనమానందమును పొందెదము. గంగానదిలో స్నానము చేయువారి పాపములన్నియు తొలగును. అట్టి పావనమైన నది కూడ యోగు లెప్పుడు వచ్చి తనలో మునిగి, తనలో ప్రోగైన పాపములన్నిటిని వారి పాదధూళిచే పోగెట్టదరాయని యాతురుతతో జూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొనిపోవునని గంగామాతకు తెలియును. యోగులలో ముఖ్యాలంకారము శ్రీసాయి. పావనము చేయు ఈ క్రింది కథను వారినుండి వినుడు.

సర్పము, కప్ప

సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడంగెను. "ఒకనాడుదయము ఉపాహారము ముగించిన తరువాత వాహ్యాళికి పోయి యొక చిన్న నది యొడ్డున చేరితిని. అలసిపోవుటచే నచట విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుగుకొని స్నానము చేసి, హాయిగా కూర్చుని యుంటిని. అచట చెట్లనీడలున్న కాలిత్రోవ బండిత్రోవలు రెండును కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప యొకటి బెక బెక లాడుట వింటిని. చెకుముకిరాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణీకుడు వచ్చినాప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో నాహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నా కందజేసెను. కప్ప బెక బెక మనుట తిరిగి వినిపించెను. అతడు అదేమియో తెలిసికొన గోరెను. ఒక కప్ప తన పూర్వ జన్మపాపఫలముననుభవించుచున్నదని చెప్పితిని. గతజన్మలో చేసినదాని ఫలము నీ జన్మలో ననుభవించి తీరవలయును. దానినిగూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును బీల్చి నాకందజేసి, తానే స్వయముగా పోయి చూచెదనని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి యరచుచుండెననియు గతజన్మలో రెండును దుర్మార్గులేగాన, ఈ జన్మయందు గతజన్మయొక్క పాపము నీశరీరములతో ననుభవించు చున్నవనియు చెప్పితిని. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్దపాము ఒక కప్పను నోటితో బట్టుకొని యుండుట చూచెను. అతడు నావద్దకు వచ్చి 10, 12 నిముషములలో పాము కప్పనుమ్రింగునని చెప్పెను. నేనిట్లంటిని. "లేదు. అట్లు జరుగనేరదు. నేనే దాని తండ్రిని (రక్షకుడను). నేనిచటనే యున్నాను. పాముచేత కప్ప నెట్లు తినిపించెదను? నేనిక్కడ ఊరకనే యున్నానా? దాని నెట్లు విడిపించెదనో చూడు." చిలుము పీల్చిన పిమ్మట, మేమా స్థలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్నుకూడదగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీదపడి కరచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు బోయి యిట్లంటిని. "ఓ వీరభద్రప్పా! నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపపడుట లేదా? నీవు సర్పజన్మ మెత్తినప్పటికిని వాని యందు శత్రుత్వము వహించి యున్నావా? ఛీ, సిగ్గు లేదా! మీ ద్వేషములను విడచి శాంతింపుడు."

ఈ మాటలు విని, యాసర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యెను. కప్పకూడ గంతువేసి చెట్లపొదలలో దాగెను.

బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్నమాటలకు పాము కప్పనెట్లు వదలి యదృశ్యమయ్యెను? వీరభద్రప్ప యెవరు? చెన్నబసప్ప యెవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి? అని యతడు ప్రశ్నించగా, నతనితో కలసి చెట్టు మొదటికి పోయితిని. చిలుము కొన్ని పీల్పులు పీల్చి, వృత్తాంత మంతయు నీరీతిగా బోధించితిని.

"మాయూరికి 4, 5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము గలదు. అది పాతబడి శిథిలమయ్యెను. ఆ గ్రామములోని ప్రజలు దానిని మరామతు చేయుటకై కొంత ధనమును ప్రోగుచేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట, పూజకొరకు తగిన యేర్పాటులు చేసిరి. మరామతు చేయుట కంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై బెట్టిరి. వాడు పరమలోభి; దేవాలయము బాగు చేయుటకు చాల తక్కువ వ్యయము చేసెను. దేవాలయములో నేమి యభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చుపెట్టెను. కొంత తాను మ్రింగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తియ్యని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండుటకేవో కారణములు చెప్పెడివాడు. గ్రామస్థులు తిరిగి వానివద్దకు బోయి అతడు సొంతముగా తగిన ధనసహాయము చేయనియెడల మందిరము వృద్ధికాదని చెప్పిరి. వారి అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలుచేసి యాతని కిచ్చిరి. వాడాధనమును పుచ్చుకొని, పూర్వము వలెనే యూరక కూర్చుండెను. కొన్నాళ్ళపిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో గనిపించి యిట్లు చెప్పెను. "నీవు లేచి దేవాలయపు శిఖరమును గట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చెదను." ఆమె యీ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో యని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమనియు, దానిని నమ్మనవసరము లేదనియు, లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో గనపడి యేల చెప్పలేదనియు, తాను మాత్రము దగ్గరగా లేకుండెనా యనియు, ఇది దుస్స్వప్నమువలె గనిపించుచున్నదనియు, భార్యాభర్తలకు విరోధము కల్పించునటుల తోచుచున్నదనియు అతడు సమాధానముచెప్పెను. అందుచే ఆమె ఊరుకొనవలసివచ్చెను.

దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టముండదు. భక్తితోను, ప్రేమతోను, మన్ననతోను ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకయిన దైవమిష్టపడును. కొన్ని దినముల పిమ్మట, దేవుడామెకు స్వప్నములో తిరిగి కనిపించి యిట్లనెను. "భర్త దగ్గరనున్న చందాలగూర్చి చీకాకు చెంద నవసరములేదు. దేవాలయము నిమిత్తమేమైన వ్యయము చేయుమని యాతని బలవంతము చేయవద్దు. నాకు కావలసినవి భక్తి, మరియు సద్భావము, కాబట్టి నీ కిష్టమున్న సొంతము దేదైన ఇవ్వవలెను." ఆమె తన భర్తతో సంప్రదించి తనతండ్రి తన కిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను. ఆ లోభి యా సంగతి విని, చీకాకు చెంది, భగవంతునికూడ మోసము చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగలనెంతో తక్కువ ధరకట్టి 1000 రుపాయలకు తానే కొని, నగదునకు బదులుగా నొకపొలము దేవాదాయముగా నిచ్చెను. అందులకు భార్యసమ్మతించెను. ఆ పొలము వాని సొంతము గాదు. అదియొక పేదరాలగు డుబ్కీయను నామెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదువ పెట్టి యుండెను. ఆమె దానిని తీర్చలేక పోయెను. ఆ టక్కరి లోభి తన భార్యను, డుబ్కీని, దైవమును కూడ అందరిని మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేదు, దాని విలువ చాల తక్కువ, దానివలన ఆదాయమేమియు లేదు.

ఈ వ్యవహారమిట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి యధీనములో నుంచిరి. అందుల కతడు సంతసించెను. కొన్నాళ్ళకు ఒక చిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను, కుంభవృష్టి కురిసెను. లోభి యింటికి పిడుగు పాటు తగిలి వాడు, వాని భార్య చనిపొయిరి. డుబ్కీ కాలగతి చెందెను.

తరువాత జన్మలో ఆ లోభి మధురాపట్టణములో నొక బ్రాహ్మణకుటుంబములో పుట్టి వీరభద్రప్పయను పేరనుండెను. అతని భార్య పూజారి కొమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరి యని పేరు పెట్టిరి. డుబ్కీ మందిరపు గొరవ యింటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్న బసప్ప యని నామ మిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరుచుగా వచ్చుచుండెను. నావద్ద కూర్చుండి మాట్లడుచు చిలుము పీల్చెడివాడు. అతని కొమార్తె గౌరి కూడ నా భక్తురాలు. ఆమే త్వరగా నెదుగు చుండెను. ఆమె తండ్రి వరునికై వెదకుచుండెను. ఆ విషయమై చీకాకు పడనవసరము లేదనియు, నామె భర్త తానై వెదకుకొని వచ్చుననియు నేను చెప్పితిని. కొన్నాళ్ళకు వీరభద్రప్పయను ఒక బీద బ్రాహ్మణబాలుడు భిక్షకై పూజారి యింటికి వచ్చెను. అతడుకూడ నా భక్తుడయ్యెను. ఏలన వానికి పిల్లను కుదిర్చితినని నాయందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈజన్మలో కూడ ధనముకై మిగుల తాపత్రయ పడుచుండెను. నా వద్దకు వచ్చి యాతడు కుటుంబముతో నుండుటచే తన కెక్కువగా ధనము వచ్చునట్లు చేయుమని బతిమాలుచుండెను.

ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరి యదృష్టముకొలది పొలమునకు ధర పెరిగెను. కానుకగా నిచ్చిన పొలము ఒకలక్ష రూపాయల కమ్మిరి. ఆమె యాభరణముల విలువకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరు సమ్మతించిరి. కాని, ధనమునకై తగవులాడిరి. సలహాకొరకు నావద్దకు వచ్చిరి. ఆ యాస్తి మహాదేవునిది, కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరికి వచ్చెను. ఆమె సమ్మతి లెనిదే యేమీ ఖర్చు చేయవద్దని చెప్పితిని. ఆమె భర్తకు ఈ పైకముపై నెట్టి యధికారము లేదని బోధించితిని. ఇది విని వీరభద్రప్ప నా పై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు గలదని తీర్మానించి, దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకొంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే నామె పగటి పూట నా వద్దకు వచ్చి యితరుల మాటలు పట్టించుకొనవలదని తనను కూతురుగా జూచుకొనవలెనని వేడుకొనెను. ఆమె నా యాశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు సప్తసముద్రములైన దాటుదునని వాగ్దానమిచ్చితిని. ఆనాడు రాత్రి గౌరికొక స్వప్నదృశ్యము గనపడెను. మహాదేవుడు స్వప్నములో గనిపించి యిట్లనెను. "ధనమంతయు నీదే. ఎవరికి నేమియును ఇవ్వవలదు. చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరామతు నిమిత్తము కొంత ఖర్చు చేయుము. ఇతరములకైవ్యయము చేయవలసి వచ్చునపుడు మసీదులోనున్న బాబా సలహా తీసికొమ్ము." గౌరి నాకీ వృత్తాంతమంతయు దెలిపెను. నేను తగిన సలహా నిచ్చితిని. అసలును తీసికొని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్ప కివ్వుమనియు వీరభద్రప్ప కిందులో జోక్యము లేదనియు నేను గౌరికి సలహా నిచ్చితిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప, చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంతవరకు వారిని సమాధానపరచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్నదృశ్యమును చెప్పితిని. వీరభద్రప్ప మిగుల కోపించి చెన్న బసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించెను. చెన్నబసప్ప పిరికివాడు. వాడు నా పాదములబట్టి నన్నే యాశ్రయించెను. వాని కోపిష్ఠి శత్రువు బారినుండి కాపాడెదనని నేను వానికి వాగ్దానము చేసితిని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను; చెన్నబసప్ప కూడ చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసప్ప బెక బెక లాడుట విని, నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి దెచ్చుకొని, ఇక్కడకు వచ్చి వానిని రక్షించి, నా మాటను పాలించుకొంటిని. భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరుగెత్తును. భగవంతుడు నన్నిచటకు బంపి చెన్నబసప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల."

నీతి

ఈ కథవల్ల మనము నేర్చుకొనిన నీతి యేమన ఎవరు చేసిన దానిని వారే యనుభవించవలెను. ఇతరులతోగల సంబంధములన్నిటిని, బాధను కూడ అనుభవించవలెను. తప్పించుకొను సాధనము లేదు. తన కెవరితోనైన శత్రుత్వమున్నయెడల దానినుండి విముక్తినిపొందవలెను. ఎవరికైన ఏమైనను బాకీయున్న దానిని తీర్చివేయవలెను. ఋణము గాని, శతృత్వశేషముకాని యున్నచో దానికి తగిన బాధ పడవలెను. ధనమునందు పేరాసగలవానినది హీనస్థితికి దెచ్చును. తుట్టతుదకు వానికి నాశనము కలుగజేయును.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదియేడవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

నలుబదియారవ అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నలుబదియారవ అధ్యాయము

బాబా గయవెళ్ళుట - రెండు మేకల కథ

ఈ అథ్యాయములో శ్యామా కాశి, గయ, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటోరూపమున నతనికంటె ముందు వెళ్ళుట చెప్పెదము. బాబా రెండుమేకల పూర్వజన్మవృత్తాంతమును జ్ఞప్తికి దెచ్చుట గూడ చెప్పుకొందుము.

తొలిపలుకు

ఓ సాయి! నీ పాదములు పవిత్రము లయినవి. నిన్ను జ్ఞప్తియందుంచుకొనుట మిగుల పావనము. కర్మబంధములనుండి తప్పించు నీ దర్శనము కూడ మిక్కిలి పావనమయినది. ప్రస్తుతము నీరూప మగోచరమయినప్పటికి, భక్తులు నీయందే నమ్మక ముంచినచో, వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటి కగపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గరనుండిగాని యెంతోదూరమునుండిగాని యీడ్చెదవు. వారిని దయగల తల్లివలె కౌగిలించుకొనెదవు. నీ వెక్కడున్నావో నీ భక్తులకు దెలియదు. కాని నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కాని నీవు శక్తివలన నిరాడంబరభక్తుల రక్షించెదవు. ఆంతరికముగను, అదృశ్యముగను ఆటంతయు నాడెదవు. కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు గనిపించెదవు. నీవే పనులన్నియును నెరవేర్చుచున్నప్పటికి ఏమియు చేయనివానివలె నటించెదవు. నీ జీవితము నెవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపములనుండి విముక్తి పొందుట యెట్లన-శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుని కోరికలను నీవు నెరవేర్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభసాధనము. ఈ సాధనవల్ల మన పాపములు, రజస్తమోగుణములు నిష్క్రమించును. సాత్వికగుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే యనగా నాత్మనేయనుసంధానము చేసెదము. ఇదియే గురువునకు సర్వస్యశరాణాగతి. దీనికి తప్పనిసరి యొకేగుర్తు - మన మనస్సు నిశ్చలము శాంతము నగుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి, జ్ఞానములు, విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమానరాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము, ఒకటి వెనుక నింకొకటి వెన్నంటి వచ్చును.

ఒకవేళ బాబా ఎవరైన భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే యుండి, యింటి వద్దనుగాని దూరదేశమునగాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తనయిష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము, బాబా అచ్చటకు భక్తునికంటె ముందుగా బోయి యేదో ఒక ఊహించరానిరూపమున నుండును. ఈ దిగువకథ దీనికి ఉదాహరణము.

గయ యాత్ర

బాబాతో పరిచయము కలిగిన కొన్నాళ్ళ తరువాత కాకాసాహెబు తనపెద్దకుమారుడు బాబు ఉపనయనము నాగపూరులో చేయనిశ్చయించెను. సుమారదే సమయమందు నానాసాహెబు చాందోర్కరు తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్ లో చేయ నిశ్చయించుకొనెను. కాకాసాహెబు, నానాసాహెబు చాందోర్కరును, షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా దీసికొని వెళ్లుడని బాబా నుడివెను. తామే స్వయముగా రావలసినదని బలవంతపెట్టగా బాబా వారికి శ్యామాను దీసుకొని పోవలసినదనియు "కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామాకంటె ముందుగనే గయలో కలిసికొనెద" నని చెప్పెను. ఈమాటలు గుర్తుంచుకొనవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపియని నిరూపించును.

బాబా సెలవు పుచ్చుకొని, శ్యామా నాగపూరు గ్వాలియరు పోవ నిశ్చయంచెను. అచటినుండి కాశీ, ప్రయాగ, గయ పోవలె ననుకొనెను. అప్పాకోతే యతని వెంట బోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూరులో జరుగు ఉపనయనమునకు బోయిరి. కాకాసాహెబు దీక్షిత్ శ్యామాకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుక నిచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి బోయిరి. అచ్చట నానాసాహెబు చాందోర్కరు శ్యామాకు 100 రూపాయలును, అతని బంధువగు జథార్ 100 రూపాయలును ఇచ్చిరి. అక్కడినుండి శ్యామా కాశీకి వెళ్లెను. అచ్చట జథారు యొక్క అందమైన లక్షీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము జరిగెను. అచ్చటినుండి శ్యామా అయోధ్యకు పోయెను. అచ్చట జథారు మేనేజరు శ్రీ రామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజు లుండిరి, కాశీలో రెండు మాసము లుండిరి. అక్కడనుండి గయకు పోయిరి. రైలుబండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెము చీకాకు పడిరి, రాత్రి గయస్టేషనులో దిగి ధర్మశాలలో బసచేసిరి. ఉదయమే గయ పండా వచ్చి యిట్లనెను. "యాత్రికు లందరు బయలుదేరుచున్నారు. మీరు కూడ త్వరపడుడు." 'అచ్చట ప్లేగు గలదా?' యని శ్యామా ప్రశ్నించెను. లేదని పండా జవాబు నిచ్చెను. మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ యిల్లు చాల పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామా చాల సంతుష్టిచందెను. అచ్చట గల బాబాయొక్క అందమైన పెద్దపటము అతనికి అన్నింటికంటె ఎక్కువ ప్రీతిని కలుగజేసెను. అది యింటికి ముందు భాగములో మధ్య నమర్చబడియుండెను. దీనిని చూచి శ్యామా మైమరచెను. "కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామాకంటె ముందుగనే గయకు బోయెదను" అను బాబా పలుకులను జ్ఞప్తికి దెచ్చుకొనెను. కండ్ల నీరు గ్రమ్మెను, శరీరము గగుర్పొడిచెను, గొంతుక యార్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి యేడ్వసాగెను. ఆ పట్టణములో ప్లేగు జాడ్యము గలదని భయపడి యేడ్చుచున్నాడేమో యని పండా యనుకొనెను. పండాను బాబా పటమెక్కడనుండి తెచ్చితివని శ్యామా అడిగెను. పండా తన ప్రతినిధులు రెండుమూడువందల మంది మన్మాడులోను, పుణతాంబేలోను గలరనియు, వారు గయకు పోయే యాత్రికుల మంచిచెడ్డల చూచెదరనియు, వారివల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 యేండ్ల క్రిందట చేసితిననియు చెప్పెను. షిరిడీలో శ్యామా యింటిలో వ్రేలాడుచున్న బాబా పటమును జూచి దానినిమ్మని కోరితిననియు బాబా యనుజ్ఞపొంది శ్యామా దానిని తన కిచ్చెననియు చెప్పెను. శ్యామా పూర్వము జరిగిన దంతయు జ్ఞప్తికి దెచ్చుకొనెను. పూర్వము తనకు పటము నిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన యింట నతిథిగా నుండుట గ్రహించి పండా మిక్కిలి యానందించెను. వారిరువురు ప్రేమానురాగములనుభవించి యమితానందమును పొందిరి. శ్యామాకు పండా చక్కని రాజలాంఛనములతోడి స్వాగత మిచ్చెను. పండా ధనవంతుడు. అతడొక పల్లకీలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యము లన్నియు నేర్పరచెను.

ఈ కథవల్ల నేర్చుకొనవలసిన నీతి :- బాబా మాటలు అక్షరాలా సత్యములనియు బాబాకు తన భక్తులందుగల ప్రేమ యమితమనియు తెలియుచున్నది. ఇదియేగాక, వారికి జంతువులయందు కూడ సమాన ప్రేమ యుండెను. వారు వానిలో నొకరుగాభావించెడివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును.

రెండు మేకల కథ

ఒకనాడుదయము బాబా లెండితోటనుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకలమందను జూచెను. అందులో రెండుమేకల మీద బాబా దృష్టిపడెను. బాబా వానిని సమీపించి ప్రెమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని జూచి భక్తులు ఆశ్యర్యపడిరి. బాబా మిగుల మోసపోయెనని వారనుకొనిరి. ఎందుచేతననగా నొక్కొక్కమేకను 2 గాని, 3 గాని 4 గాని రూపాయలకు కొనవచ్చును. రెండు మేకలును 8 రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా నూరకొనెను. శ్యామా, తాత్యాకోతె బాబాను సమాధానము వేడగా బాబా "నాకు ఇల్లుగాని, కుటుంబముగాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు." అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని వానికి పెట్టుమని చెప్పెను. పిదప ఆ మేకలను వాని యజమానికి తిరగి యిచ్చివేసెను. వాని పూర్వవృత్తాంతమును ఈ రీతిగా చెప్పెను.

"ఓ శ్యామా! తాత్యా! మీరీ బేరములో నేను మోసపోయితినని యనుకొనుచున్నారు. అట్లు కాదు, వానికథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి యదృష్టము కొలది నా జతగాండ్రుగా నుండెడివారు. వారొకే తల్లి బిడ్డలు. మొదట వారికి నొకరిపైనొకరికి ప్రేమయుండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరి గాని చిన్నవాడు చురుకైన వాడు. అతడు చాల ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయచెంది చిన్నవానిని చంపి వాని ద్రవ్యము నపహరింపనెంచెను. తమ సోదరత్వమును మరచి వారిద్దరు కలహించిరి. అన్న తమ్ముని జంపుటకు పెక్కు పన్నుగడులను పన్నెను, కాని నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరు బద్దవైరు లయిరి. ఒకనాడు అన్న తన సోదరుని బెడితెతో కొట్టెను, చిన్నవాడు అన్నను గొడ్డలితో నరకెను. ఇద్దరదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలములచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్కనుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టితిని. వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి దెచ్చుకొంటిని. వారియందు కనికరించి వారికి తిండి పెట్టి, కొంత విశ్రాంతి కలుగజేసి యోదార్చవలెనని యనుకొంటిని. అందుచే నింతద్రవ్యమును వ్యయపరచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరిష్టపడకుండుటచే నేను వాని యజమానివద్దకు తిరిగి పంపివేసితిని." మేకలపైని కూడ బాబా ప్రేమ యెట్టిదో చూడుడు.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదియారవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

నలుబదియైదవ అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

(7వ రోజు పారాయణ - బుధవారము)

నలుబదియైదవ అధ్యాయము

1. కాకాసాహెబు సంశయము 2. ఆనందరావు దృశ్యము 3. కఱ్ఱబల్ల మంచము బాబాదే - భక్త మహళ్సాపతిది కాదు.

తొలిపలుకు

గత మూడు అధ్యాయములలో బాబా దివంగతులగుట గూర్చి చెప్పితిమి. వారిభౌతికశరీరము మన దృష్టినుండి నిష్క్రమించెను, గాని వారి యనంత స్వరూపము లేదా సాయిశక్తి యెల్లప్పుడు నిలిచియేయుండును. ఇప్పటివరకు వారి జీవితకాలములో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్తలీలలు జరుగుచున్నవి. దీనినిబట్టి బాబా శాశ్వతముగా నున్నారనియు తమ భక్తులకు పూర్వమువలె తోడ్పడుచున్నారనియు తెలియుచున్నది. ఎవరయితే బాబా సమాధి చెందక ముందు వారిని జూచిరో వారు నిజముగ నదృష్టవంతులు. అట్టి వారిలో నెవరైన ప్రపంచసుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొననిచో, వారి మనస్సులు భగవత్పరము కానిచో యది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడు కాదు ఇప్పుడుకూడ కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, యింద్రియములు, మనస్సు బాబా సేవలో నైక్యము కావలెను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కినవారిని వేరే సంచరించునట్లు చేసినచో, ప్రయోజనము లేదు. పూజగాని ధ్యానము కాని చేయ పూనుకొనినచో, దానిని మనః పూర్వకముగను ఆత్మశుద్ధితోడను చేయవలెను.

పతివ్రతకు తన భర్తయందుగల ప్రేమను, భక్తుడు గురువు నందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికి మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలులేదు. జీవితపరమావధిని పొందుటకు తండ్రిగాని, తల్లిగాని, సోదరుడుగాని యింక తదితరబంధువు లెవ్వరుగాని తోడ్పడరు. ఆత్మసాక్షాత్కారమునకు దారిని మనమే వెదుగుకొని మనమే ప్రయాణము సాగించవలెను. నిత్యానిత్యములకు భేదమును తెలిసికొని, ఇహలోక పరలోకములలోని విషయసుఖములను త్యజించి మన బుద్ధిని, మనస్సును స్వాధినమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై నాధారపడుటకంటె మన స్వశక్తియందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను. ఎప్పుడయితే నిత్యానిత్యములకు గల భేదమును పాటించెదమో, ప్రపంచము అబద్ధమని తెలిసికొనెదము. దానివలన ప్రపంచవిషయములందు మోహము తగ్గి, మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మస్వరుపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. ఇదియే అద్వైతభజనము లేదా పూజ. ఎప్పుడయితే మనము బ్రహ్మమును, లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించెదమో, మనము కూడ వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారము పొందెదము. వేయేల, గురువు నామమును జపించుట వలనను, వారి స్వరుపమునే మనమున నుంచుకొని ధ్యానించుటచేతను వారిని సర్వజంతుకోటియందు చూచుట కవకాశము కలుగును. మన కది శాశ్వతానందమును కలుగజేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును.

కాకాసాహబు సంశయము - ఆనందరావు దృశ్యము

కాకాసాహబుదీక్షిత్ ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థరామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబు దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధిచెందిన తరువాత కూడ అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటిలోనున్న కాకామహాజని యింటిలో కాకాసాహెబు దీక్షిత్ ఏకనాథభాగవతము చదువుచుండెను. శ్యామా, కాకామహాజని కూడ నచట నుండి శ్రద్ధతో భాగవతము చదువుచుండెను. అందు వృషభకుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులగు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్ హోత్ర, దృమిళ, ఛమస్, మరియు కరభజన్ లు భాగవతధర్మసూత్రములను జనకమహరాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని యడగెను. వారొక్కొక్కరు సంతృప్తి కరమైన సమాధానము లిచ్చిరి. అందులో మొదటివాడగు కవి భాగవతధర్మమును బోధించెను. హరి భక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్ హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని యవతారములను వారి లీలలను, చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పరిస్థితిని, కరభజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వాని సారాంశ మేమన కలియుగములో మోక్షము పొందుట కొక్కటే మార్గము గలదు. అదేమన గురుని లేదా హరి పాదారవిందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబు నిరుత్సాహపడి శ్యామాతో నిట్లనియె. "నవనాథులు భక్తివిషయమై చెప్పినది యెంత అద్భుతముగా నున్నది? దాని నాచరించుట యెంత కష్టము? నవనాథులు పూర్ణజ్ఞానులేగాని మనవంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? అనేక జన్మ లెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయిన మనకు మోక్షము వచ్చునెట్లు? కాబట్టి యట్టిదానిని మనమాచరించరాదని తెలియుచున్నది." కాకా సాహెబు నిరుత్సాహము, నిరాశలు శ్యామా యిష్టపడలేదు. వెంటనే యతడిట్లనెను. "ఎవరయితే వారి యదృష్టవశముచే బాబా వంటి యాభరణమును పొందిరో, అట్టివారు నిరాశచెంది యేడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే యున్నచో, వారు చిరాకు చెందనేల? నవనాథుల భక్తి బలమైనదై యుండవచ్చును గాని, మనది మాత్రము ప్రేమానురాగములతో నిండియుండలేదా? హరినామస్మరణ గురునామస్మరణ మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పియుండలేదా? అట్లయినచో భయమునకుగాని, ఆందోళనకుగాని యవకాశ మేది?" కాకాసాహెబు శ్యామా చెప్పిన సమాధానముతో సంతుష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు? అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను. ఆ మరుసటి యుదయమే యీ క్రింది యద్భుతము జరిగెను.

ఆనందరావు సాఖాడే యనువాడు శ్యామాను వెదుకుచు పురాణకాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబ్ భాగవతము చదువు చుండెను. సాఖాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో నేమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్నదృశ్యమును శ్యామాకు చెప్పుచుండెను. ఇది పురాణకాలక్షేపమునకు కొంచెమాటంకము గలుగజేసెను. కాకాసాహెబు పురాణము చదువుట మాని విషయమేమని యడిగెను. శ్యామా యిట్లు నుడివెను. "నిన్న నీ సంశయమును దెలిపితివి. దానికి సమాధాన మిదిగో! బాబా సాఖాడేకు చూపిన స్వప్నదృశ్యమును వినుము. "రక్షకమైన భక్తి" వేరేదియు దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కిచెప్పియున్నారు." అందరు ముఖ్యముగా కాకాసాహెబు ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కొరిక ప్రకారము సాఖాడే యా దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్ప నారంభించెను.

లోతైన సముద్రములో నడుమువరకు దిగి యచ్చట నిలచితిని. హఠాత్తుగా నచట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చునియుండెను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపమును జూచి మిగుల ఆనందించితిని, అది నిజమువలె నుండెనే కాని స్వప్నమువలె గానరాకుండెను. దానిని నేను స్వప్నమని యనుకోలేదు. మాధవరావు కూడ అచ్చట నిలచి యుండెను. శ్యామా "ఆనందరావు! బాబా పాదములపై బడుము" అని సలహా నిచ్చెను. "నాకు కూడ నమస్కరించవలెననియే యున్నది, కాని వారి పాదములు నీటిలో నున్నవి. కనుక నా శిరస్సును వారి పాదములపై నెట్లుంచగలను? నేను నిస్సహాయుడను" అని నేనంటిని. అది విని యతడు బాబాతో నిట్లనెను. "ఓ దేవా! నీటిలో నున్న నీ పాదములను బయటకు దీయుము." వెంటనే బాబా తమ పాదములను బయటకు తీసెను. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కితిని. దీనిని జూచి బాబా నన్ను దీవించి యిట్లనెను. "ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయమునకు గాని ఆందోళనకు గాని కారణము లేదు. శ్యామాకు పట్టుపంచె యొకటి దానము చేయుము, దానివల్ల మేలు పొందెదవు."

బాబా యాజ్ఞానుసారము సాఖాడేపట్టుదోవతిని తెచ్చెను. మాథవరావు కివ్వవలసినదని కాకాసాహెబును వేడెను. శ్యామా యందుల కొప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహా నివ్వలేదు కనుక. కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబు చీట్లువేసి తెలిసికొనుటకు సమ్మతించెను. సంశయవిషయములందు చీటివేసి సంశయమును దీర్చు కొనుట కాకాసాహెబు స్వభావము. 'పుచ్చుకొనుము', 'నిరాకరించుము' అను రెండు చీటీలు వ్రాసి బాబా పాదుకలవద్ద బెట్టిరి. ఒక బాలునితో అందులో నొకదానిని తీయించిరి. 'పుచ్చుకొనుము' అను చీటీ ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి. కాకాసాహెబు సంశయము తీరెను.

ఇతర యోగుల మాటలను కూడ గౌరవించవలసినదని యీ కథప్రబోథించుచున్నది. కాని మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తివిశ్వాసము లుండవలెను. వారి బోధల ప్రకారము నడువవలెను. ఎందుకనగా మన కష్టసుఖము లితరులకంటె వారికే బాగా తెలిసియుండును. నీ హృదయఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో ననేకమంది యోగులు గలరు. గాని మన గురు వసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును. కాని, మనము మన గురువుయొక్క పలుకులను మరువరాదు. వేయేల, హృదయపూర్వకముగ నీ గురువును ప్రేమించుము వారిని సర్వస్యశరాణాగతి వేడుము భక్తితో వారి పాదములకు మ్రొక్కుము అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు, నీవు దాటలేని భవసాగరము లేదు.

కఱ్ఱబల్ల మంచము బాబాదే, మహళ్సాపతిది కాదు

బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలమునకే 4 మూరల పొడవు, ఒక జానెడు వెడల్పుగల కఱ్ఱబల్ల మీద నాలుగు చివరలకు నాలుగు దీపపు ప్రమీదలు పెట్టి దానిపై పండుకొనువారు. కొన్నాళ్ళు గడచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేసెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబుకు వర్ణించి చెప్పుచుండెను. ఇదివిని యతడు బాబా కిట్లనియె. "మీ కింకను కఱ్ఱబల్లయందు మక్కువ యున్నచో నింకొక బల్ల మీ కొరకు మసీదులో వ్రేలాడ వేసెదను. దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును." అందుకు బాబా ఇట్లనెను. "మహళ్సాపతిని దిగువ విడిచి నే నొక్కడనే పైన పండుకొనుట కిష్టము లేదు." కాకాసాహెబు ఇట్లనెను. "మహళ్సాపతికొరకింకొక బల్లను తయారు చేయించెదను." బాబా "అత డెట్లు బల్లపై పరుండగలడు. బల్లమీద అంత ఎత్తున పండుకొనుట సులభమయిన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పండుకొనగలరు. ఎవరయితే కండ్లు దెరచి నిద్రించగలరో వారికే యది వీలగును. నేను నిద్రపోవునపుడు, మహళ్సాపతిని నా ప్రక్కన కుర్చుండి తన చేయి నా హృదయముపై నుంచుమనెదను. అచ్చటినుంచి వచ్చు భగవన్నామస్మరణమును వినుమనెదను. నేను పండుకొనినచో నన్ను లేవగొట్టు మనెదను. దీనినే యతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచుండును. నా హృదయముపై వాని చేతిబరువును గమనించి, ఓ భక్తా! అని పిలచెదను. వెంటనే కండ్లు తెరచి కదలును. ఎవడయితే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండ యుండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో, వాడు ఎత్తైన బల్లమీద నెట్లు పండుకొనగలడు?" అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తులయందు ప్రేమచేనిట్లనెను. "మంచిగాని చెడ్డగాని, ఏది మనదో యది మనదగ్గర నున్నది. ఏది యితరులదో, యది యితరులవద్ద నున్నది."

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదియైదవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

43, 44 అధ్యాయములు

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

43, 44 అధ్యాయములు

బాబా సమాధి చెందుట

1. సన్నాహము 2. సమాధిమందరిము 3. ఇటుకరాయి విరుగుట 4. 72 గంటల సమాధి 5. జోగుయొక్క సన్యాసము 6. అమృతము వంటి బాబా పలుకులు

43, మరియు 44 అధ్యాయములు కూడ బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించునవి కనుక వాటినొకచోట చేర్చుట జరిగినది.

ముందుగా సన్నాహము

హిందువులలో నెవరైన మరణించుటకు సిద్ధముగా నున్నప్పుడు, మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణాచారము. ఏలన ప్రపంచ విషయములనుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీనమొనర్చినచో నతడు పరమును సహజముగాను, సులభముగాను పొందును. పరీక్షిన్మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి, వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగా నున్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవతపురాణమును ఆ వారములో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికిని అలవాటులో నున్నది. చనిపొవుటకు సిద్ధముగా నున్నవారికి గీతా, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కాని బాబా భగవంతుని యవతారమగుటచే వారికట్టిది యవసరము లేదు. కాని, యితరులకు ఆదర్శముగా నుండుటకు ఈయలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగనే వారు వజే యను నాతని బిలిచి రామవిజయమను గ్రంథమును పారాయణ చేయుమనిరి. అతడు వారములో గ్రంథము నొకసారి పఠించెను. తిరిగి దానిని చదువుమని బాబా యాజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు చదివి దానిని మూడు దినములలో రెండవ పారాయణము పూర్తిచేసెను. ఈ విధముగా 11 దినములలో రెండవ పారాయణము పూర్తిచేసెను. ఈ విధముగా 11 దినములు గడచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి యలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధాములో మునిగి చివరి క్షణముకయి యెదురు చూచుచుండిరి.

రెండుమూడుదినముల ముందునుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరవరకు బాబా చైతన్యముతో నుండి, అందరిని ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయెదరో ఎవరికిని తెలియనీయలేదు. ప్రతిదినము కాకాసాహెబు దీక్షితు, శ్రీమాన్ బుట్టీయు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడివారు. ఆనాడు (అక్టోబరు 15వ తారీఖు) హారతి పిమ్మట వారిని వారివారి బసలకుబోయి భోజనము చేయుమనెను. అయినను కొంతమంది లక్షీబాయి శిందే, భాగోజి శిందే, బాయాజి, లక్షణ్ బాలాషింపి, నానాసాహెబు నిమోన్కర్ యక్కడనే యుండిరి. దిగువ మెట్లమీద శ్యామా కూర్చొనియుండెను. లక్షీబాయి శిందేకు 9 రూపాయలను దానము చేసినపిమ్మట, బాబా తనకాస్థలము (మసీదు) బాగలేదనియు, అందుచేత తనను రాతితో కట్టిన బుట్టీ మేడలోనికి దీసికొని పోయిన నచట బాగుగా నుండుననియు చెప్పెను. ఈ తుదిపలుకు లాడుచు బాబా బాయాజీ శరీరముపై ఒరిగి ప్రాణములు విడిచెను. భాగోజీ దీనిని గనిపెట్టెను. దిగువ కూర్చొనియున్న నానాసాహెబు నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబు నీళ్ళు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా! యని యరచెను. బాబా తన భౌతికశరీరమును విడిచిపెట్టెనని తేలిపోయెను.

బాబా సమాధి చెందెనని సంగతి శిరిడి గ్రామములో కార్చిచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరు స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి యేడ్వసాగిరి. కొందరు బిగ్గరగా నేడ్చిరి. కొందరు వీథులలో నేడ్చుచుండిరి. కొందరు తెలివితప్పి పడిరి. అందరి కండ్లనుండి నీళ్ళు కాలువలవలె పారుచుండెను. అందరును విచారగ్రస్తు లయిరి.

కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొన మొదలిడిరి. మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యెదనని బాబా తమ భక్తులతో చెప్పిరని యొకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక నెవ్వెరును సందేహింప నక్కరలేదు. ఏలన కృష్ణావతారములో శ్రీ మహావిష్ణు వీ కార్యమే యొనర్చెను. సుందర శరీరముతో, ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీ కృష్ణుడు దేవకీదేవికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యెను. ఆ యవతారమున శ్రీ కృష్ణుడు భూమిభారమును తగ్గించెను. ఈ యవతారము (సాయిబాబా) భక్తుల నుద్ధరించుటకై వచ్చినది. కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడ లగమ్యగోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధ మీయొక్క జన్మతోడిదే కాదు, అది కడచిన డెబ్బెదిరెండు జన్మల సంబంధము. ఇట్టి ప్రేమబంధములు కల్గించిన యా మహారాజు (సాయిబాబా) ఎచటికో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు శ్రీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢవిశ్వాసము భక్తులకు గలదు.

బాబా శరీరమునెట్లు సమాధి చేయవలెనను విషయము గొప్ప సమస్య యాయెను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధిచేసి దానిపై గోరి కట్టవలె ననిరి. ఖుషాల్ చంద్, అమీరుశక్కర్ కూడ ఈ యభిప్రాయమునే వెలుబుచ్చిరి. కాని రామచంద్ర పాటీలు అను గ్రామమునసబు గ్రామములోని వారందరికి నిశ్చితమైన దృఢకంఠస్వరముతో "మీ యాలోచన మా కసమ్మతము. బాబా శరీరము రాతి వాడాలో పెట్టవలసినదే" యనిరి. అందుచే గ్రామస్థులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి.

బుధవార ముదయము గ్రామములోని జ్యోతిష్కుడును, శ్యామాకు మేనమామయునగు లక్ష్మణ్ మామాజోషికి బాబా స్వప్నములో గాన్పించి, చేయిపట్టి లాగి యిట్లనెను. "త్వరగా లెమ్ము, బాపుసాహెబు నేను మరణించితి ననుకొనుచున్నాడు. అందుచే నతడు రాడు. నీవు పూజ చేసి, కాకడహారతిని ఇమ్ము." లక్ష్మణ మామా సనాతనాచారపరాయణుడయిన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు. అతనికి బాబా యందు పూర్ణభక్తివిశ్వాసము లుండెను. ఈ దృశ్యమును చూడగనే పూజాద్రవ్యములు పళ్ళెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరచుచున్నను పూజను, హారతి చేసి పోయెను. మిట్ట మధ్యాహ్నము బాపుసాహెబు జోగ్ పూజాద్రవ్యములతో నందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను.

బాబా తుదిపలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి అచటి మధ్య భాగమును త్రవ్వుట ప్రారంభించిరి, మంగళవారము సాయంకాలము రాహాతానుండి సబ్ ఇన్ స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలములనుండి వచ్చిరి. అందరు దానిని ఆమోదించిరి. ఆమరుసటి యుదయము అమీర్ భాయి బొంబాయి నుండి వచ్చెను. కోపర్ గాం నుండి మామలతుదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో నున్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలెనని పట్టుబట్టిరి. కనుక, మామలతుదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలె ననెను. వాడా నుపయోగించుటకు రెండు రెట్లుకంటె ఏక్కువవోట్లు వచ్చెను. అయినప్పటికి జిల్లాకలెక్టరుతో సంప్రదించవలెనని అతడనెను. కనుక కాకాసాహెబు దీక్షిత్ అహమద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణవల్ల రెండవ పార్టియొక్క మనస్సు మారెను. అందరు ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధిచేయుట కంగీకరించిరి. బుథవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసికొనిపొయిరి. మురళీధర్ కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యాదార్ధముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయ మయ్యెను. అది యొక పూజామందిర మాయెను. అనేకమంది భక్తులచ్చటకు బోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబు భాటే, ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసని బాబా, బాబాకు గొప్పభక్తుడు.

ఈ సందర్భములో నొక విషయము గమనించవలెను. ప్రొఫెసరు నార్కే కథనము ప్రాకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టి నప్పటికి అది బిగిసిపోలేదు. అవయవములన్నియు సాగుచుండెను. వారి కఫినీ చింపకుండ సులభముగా దీయగలిగిరి.

ఇటుకరాయి విరుగుట

బాబా భౌతికశరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకున మయ్యెను. మసీదులో ఒక పాత యిటుక యుండెను. బాబా దానిపై చేయివేసి యానుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని యాసనస్థులగు చుండిరి. అనేక సంవత్సరము లిట్లు గడచెను. ఒకనాడు, బాబా మసీదులో లేనప్పుడు, ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు, దానిని చేతితో పట్టుకొనియుండగా అది చేతినుండి జారి క్రిందపడి రెండుముక్కలయి పోయెను. ఈ సంగతి బాబాకు తెలియగనే వారు మిగుల చింతించి యిట్లని యేడ్చిరి. "ఇటుక కాదు, నా యదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడునీడ. దాని సహాయమువలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో, దానియందు నాకంత ప్రేమ. ఈ రోజు అది నన్ను విడచినది." ఎవరైన ఒక ప్రశ్న నడుగవచ్చును. "బాబా నిర్జీవియగు ఇటుకకోసమింత విచారపడనేల?" అందులకు హేమడ్ పంతు ఇట్లు సమాధాన మిచ్చెను. "యోగులు బీదవారికి, నిస్సహాయులకు సహాయముచేయుటకై యవతరించెదరు. వారు ప్రజలతో కలసి మసలునప్పుడు ప్రజలవలె నటింతురు. వారు మన వలె బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కాని లోపల వారు శుద్ధచైతన్యులయి వారి కర్తవ్యవిధుల నెరుగుదురు”.

72 గంటల సమాధి

ఇటుక విరుగుటకు 32 సంపత్సరములకు పూర్వమందు అనగా, 1886 సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిరపౌర్ణమి నాడు బాబా ఊబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి దీసికొనిపోయి సమాధిలో నుంచవలెననుకొని, భక్త మహళ్సాపతితో నిట్లనిరి. "నా శరీరమును మూడు రోజులవరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయిన సరే, లేనియెడెల నా శరీరము నెదురుగా నున్న ఖాళి స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతుము" అని స్థలమును జూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడికూడ ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరివారందరచ్చట చేరి న్యాయవిచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కాని మహళ్సాపతి యడ్డగించెను. తన తొడపై బాబా శరీరము నుంచుకొని మూడురొజూలట్లే కాపాడుచు కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు గనిపించెను. ఊపిరి ఆడ నారంభించెను. కడపు కదలెను, కండ్లు తెరచెను. కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను.

దీనినిబట్టి చదువరు లాలోచించవలసిన విషయమేమన బాబా 3 మూరల శరీరమా లేక లోపలనున్న యాత్మయా? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీర మశాశ్వతము గాని, లోనున్న యాత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధసత్తాయే బ్రహ్మము, అదియే పంచేంద్రియములను, మనస్సును స్వాధీనమందుంచుకొనునది, పరిపాలించునది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందు గల వస్తువు లన్నిటి యందు వ్యాపించి యున్నది. అది లేనిస్థలము లేదు. అది తాను సంకల్పించు కొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతికశరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట, శరీరమును విడిచెను. సాయి యెల్లప్పుడు ఉండు వారు. అట్లనే పూర్వము గాణ్గాపురములో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు. వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని, సమస్తచేతనాచేతనములందు గూడ నుండి వానిని నియమించువారును, పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికిని సర్వస్యశరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగ భక్తితో పూజించువారికిని అనుభవనీయమయిన సంగతి.

ప్రస్తుతము బాబా రూపము చూడ వీలులేనప్పటికిని, మనము షిరిడీకి వెళ్ళినచో, వారి జీవిత మెత్తుపటము మసీదులో నున్నది. దీనిని శ్యామారావు జయకర్ యను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసియున్నాడు. భావుకుడు భక్తుడూ నైన ప్రేక్షకునికి ఈ పటము ఈ నాటికిని బాబాను భౌతికశరీరముతో చూచినంత తృప్తి కలుగజేయును. బాబాకు ప్రస్తుతము భౌతికశరీరము లేనప్పిటికి వారక్కడనేకాక ప్రతి చోటున నివసించుచు పూర్వమువలెనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబావంటి యోగులు ఎన్నడు మరణించరు. వారు మానవుల వలె గనిపించినను నిజముగా వారే దైవము.

బాపుసాహెబు జోగ్ గారి సన్యాసము

జోగు సన్యాసము పుచ్చుకొనినకథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నాడు. సఖారాం హరి, పురఫ్ బాపుసాహెబ్ జోగ్ పునా నివాసియగు సుప్రసిద్థ వార్కరి విష్ణు బువ జోగ్ గారికి మామ. 1909వ సంవత్సరమున సర్కారు ఊద్యోగమునుండి విరమించిన తరువాత (P.W.D. Supervisor), భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి, బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట, బాపుసాహెబు జోగ్ మసీదులోను, చావడిలోను కూడ బాబా మహాసమాధి పొందువరకు హారతి ఇచ్చుచుండెను. అదియునుగాక ప్రతిరోజు సాఠేవాడాలో జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతమును చదివి, వినవచ్చిన వారందరికి బోధించుచుండెను. అనేకసంవత్సరములు సేవచేసినపిమ్మట జోగ్, బాబాతో "నేనిన్నాళ్ళు నీ సేవ చేసితిని. నా మనస్సు ఇంకను శాంతము కాలేదు యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించెదవు?" అనెను. ఆ ప్రార్థన విని, బాబా "కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును. నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవభిమానమును పోగొట్టుకొని, మోహమును, రుచిని, జయించెదవో, యాటంకము లన్నిటిని కడచెదవో, హృదయపూర్వకముగ భగవంతుని సేవించుచు సన్యాసమును బుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యెదవు" అనిరి. కొద్ది కాలముపిమ్మట బాబా పలుకులు నిజమాయెను. అతని భార్య చనిపోయెను. అతనికింకొక యభిమానమేదియు లేకుండుటచే నతడు స్వేచ్చాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను.

అమృతతుల్యమగు బాబా పలుకులు

దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసారులు మసీదులో ఈదిగువ మధురవాక్యములు పలికిరి. "ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడు నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమియు చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే యెల్లప్పుడు జపించుచుండును. ఎవరయితే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానింతురో వారికి నేను ఋణస్థుడను. వారికి మోక్షము నిచ్చి వారి ఋణము దీర్చుకొనెదను. ఎవరయితే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరయితే నాకర్పించనిదే యేమియు తినరో అట్టివారిపై నేను ఆధారపడియుందును. ఎవరయితే నా సన్నిధానమునకు వచ్చెదరో, వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైన లేకుండ, నీ హృదయములో నున్న నన్ను సర్వస్యశరణాగతి వేడవలెను."

నేననగా నేవరు?

నేను అనగా నెవ్వరో సాయిబాబా యెన్నోసార్లు బోధించెను. వారిట్లనిరి. "నన్ను వెదుకుటకు నీవు దూరము గాని మరెచ్చటికి గాని పోనక్కరలేదు. నీ నామము నీ యాకారము విడిచినచో నీలోనేగాక యన్ని జీవులలోను, చైతన్యము లేదా యంతరాత్మ యని యొకటి యుండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి, నీలోనేగాక అన్నిటిలోను నన్ను జూడుము. దీనిని నీవభ్యసించినచో, సర్వవ్యాపకత్వ మనుభవించి నాలో ఐక్యము పొందెదవు."

హేమడ్ పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమన వారు వినయవిధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక! బాబా పెక్కుసారులు "ఎవరయితే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించినవారగుదురు. ఎవరయితే బాధలనుభవించెదరో, ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు" అని చెప్పిరిగదా! బాబా సర్వవస్తుజీవసముదాయములో నైక్యమైయున్నారు. భక్తులకు నలుప్రక్కలనిలచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమియు కోరరు. ఇట్టి శుభమయిన పరిశుభ్రమయిన యమృతము వారి పెదవులనుండి స్రవించుచుండెను. హేమడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో, ఉభయులును సాయితో నైక్యమగుదురు.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
43, 44 అధ్యాయములు సంపూర్ణము.

ఆరవరోజు పారాయణము సమాప్తము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

నలుబదిరెండవ అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నలుబదిరెండవ అధ్యాయము

బాబా సమాధిచెందుట

1. ముందుగా సూచించుట 2. రామచంద్ర దాదా పాటీలు, తాత్యా కోతే పాటీలుల చావులను తప్పించుట 3. లక్ష్మీబాయి శిందేకు దానము 4. చివరి దశ.

ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము.

తొలిపలుకు

గత అధ్యాయములలో చెప్పిన కథలు, బాబా కృపయను కాంతిచే ఐహికజీవితమందలి భయము నెటుల త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గము నెట్లు తెలిసి కొనగలమో, మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదారవిందములను జ్ఞప్తియందుంచుకొనినచో, మన కష్టములు నశించును. మరణము దాని నైజమును కోలిపోవును. ఐహిక దుఃఖములు నశించును. ఎవరయితే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా విన వలెను. అది వారి మనస్సును పావనము చెయును.

ముందుగా సూచించుట

చదువరు లింతవరకు బాబా జీవితకథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినెదరుగాక. 1918 సెప్టెంబరు 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము రెండు మూడు దినము లుండెను, కాని అటుతరువాత బాబా భోజనమును మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్చోబరు 15వ తేదీ మంగళవారము 2-30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచెను. ఈ విషయమును రెండు సంవత్సరములకు ముందే బాబా సూచించెను గాని, యది యెవరికి బోధపడలేదు. అది యిట్లు జరిగెను. విజయదశమినాడు సాయంకాలము గ్రామములోని వారందరు సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘన మనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫనీ, లంగోటీ తీసి వానిని చించి ముందున్న ధుని లోనికి విసిరివైచిరి. దీని మూలముగా ధుని యెక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరుడై నిలచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా అరచెను. "ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో, మహమ్మదియుడనో చెప్పుడు." అచటనున్న ప్రతివాడు గడ గడ వణకిపోయెను. బాబా వద్దకు పోవుట కెవ్వరును సాహసించలేకపోయిరి. కొంతసేపటికి భాగోజి శిందే (కుష్ఠురోగ భక్తుడు) ధైర్యముతో దగ్గరకు బోయి లంగోటును గట్టి యిట్లనెను. "బాబా! సీమోల్లంఘనమునాడు ఇదంతయునేమి?" "ఈ రోజు నా సీమోల్లంఘనము." అనుచు బాబా సటకాతో నేలపై గొట్టెను. బాబా రాత్రి 11 గంటలవరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి యుత్సవము జరుగునో లేదో యని యందరు సంశయించిరి. ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటివలె దుస్తులు వేసికొని చావడి యుత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరానాడు సమాధి చెందుదుమని సూచించిరి గాని అది యెవరికి అర్ధము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరియొక సూచన గూడ చేసిరి.

రామచంద్ర, తాత్యాకోతే పాటీళ్ళ మరణము తప్పించుట

ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధవడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను గాని, అవి గుణము నివ్వలేదు. నిరాశ చెంది, చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా యతని దిండువద్ద నిలచెను. పాటీలు బాబా పాదములు పట్టుకొని "నేను నా జీవితముపై ఆశ వదలుకొన్నాను. నేనెప్పుడు మరణించెదనో దయచెసి చెప్పుడు" అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా "నీ వాతురపడవద్దు, నీ చావు చీటి తీసివేసితిని. త్వరలో బాగుపడెదవు. కాని, తాత్యాకోతేపాటిలుగూర్చి సంశయించుచున్నాను. ఆతడు శక సం. 1840 విజయదశమినాడు (1918) మరణించును. ఇది యెవరికిని తెలియనీయకు; వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును." అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కాని యాతడు తాత్యాగూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదనియు కనుక తాత్యా రెండు సంవత్సరములలో మరణము చెందుననుకొనెను. దీనిని రహస్యముగా నుంచెను, ఎవరికిని తెలియనీయలెదు. కాని బాలాషింపికి మాత్రము చెప్పెను. రామచంద్రపాటీలు, బాలాషింపియు, ఈ యిరువురు మాత్రమే తాత్యాగుర్చి భయపడుచుండిరి.

రామచంద్ర దాదా త్వరలో ప్రక్కనుండి లేచి నడువసాగెను. కాలము వేగముగా కదలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వయుజ మాసము సమీపించుచుండెను. బాబా మాటప్రకారము తాత్యా జబ్బుపడెను. మంచము బట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలే కుండెను. బాబా కూడ జ్వరముతో నుండెను. తాత్యాకు బాబాయందు పూర్తి విశ్వాసముండెను; బాబా శ్రీ హరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడు బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడ క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు, బాలాషింపియు తాత్యాగూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరమంతయు చమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చెననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణము విడుచునని యనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను, అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా గతించెను. వారిలో వారు మరణము మార్చుకొన్నట్లు గనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యాకోసమర్పించెనని జను లనుకొనిరి. బాబా యెందుకిట్లు చేసెనో బాబాకే తెలియును. వారి కృత్యము లగోచరములు. ఇవ్విధముగా బాబా తమ సమాధిని సూచించెను. తన పేరుకు బదులు తాత్యాపేరు తెలిపెను.

ఆ మరుసటి యుదయము అనగా అక్టోబరు 16వ తేదీన పండరీ పురములో దాసగణుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి యిట్లనిరి. "మసీదు కూలిపోయినది, వర్తకులు నన్ను చాలా చీకాకు పెట్టిరి, కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే గప్పుము." షిరిడినుండి వచ్చిన ఉత్తరమువలన కూడ దాసగణుకీ సంగతి దెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజనకీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందురోజంతయు భగవన్నామ స్మరణ చేసెను. భగవన్నామస్మరణ చేయుచు నొక చక్కని పువ్వుల హారమును స్వయముగా గ్రుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను.

లక్ష్మీబాయి శిందేకు దానము

దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభసమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగా నున్నది. కొన్నిదినములనుండి వారు వ్యాధి గ్రస్తులుగా నుండిరి, లోపలమాత్రము పూర్ణచైతన్యులుగా నుండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా, లేచి కూర్చుండి మంచి స్థితిలో నున్నట్లు గనపడిరి. అపాయస్థితి దాటినదని బాబా కోలుకొనుచుండెనని యందరనుకొనిరి. తాము త్వరలో సమాధిచెందెదమని బాబాకు తెలియును. కాన, లక్ష్మీబాయి శిందేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొనిరి.

బాబా సర్వజీవవ్యాపి

ఈ లక్ష్మీబాయి శిందే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రిసమయమందు భక్త మహాళ్సాపతి, తాత్యా, లక్ష్మీ బాయి శిందే తప్ప తదితరులెవ్వరు, మసీదులో కాలుపెట్టుట కాజ్ఞలేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చొనియుండగా లక్ష్మీబాయి శిందే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా యిట్లనెను, "ఓ లక్ష్మీ! నాకు చాల ఆకలి వేయుచున్నది." వెంటనే యామె లేచి "కొంచెము సేపాగుము. నేను త్వరలో రొట్టెను దీసికొని వచ్చెదను" అని అనెను. అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె, కూర తీసికొని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని యొక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి యిట్లడిగెను. "ఇది యేమి బాబా! నేను పరుగెత్తుకొని పోయి నా చేతులార నీకొరకు రొట్టె చేసితిని. నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరముగా నాకు శ్రమ కలుగజేసితివి." అందుకు బాబా యిట్లు సమాధానమిచ్చెను. "అనవసరముగా విచారించెదవేల? కుక్క ఆకలి దీర్చుట నా ఆకలి దీర్చుట వంటిది. కుక్కకుకూడ ఆత్మగలదు. ప్రాణులు వేరు కావచ్చును. కాని అందరి ఆకలి యొకటియే. కొందరు మాట్లాడగలరు. కొందరు మూగవలె మాట్లాడలేరు. ఎవరయితే ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము." ఇది చాల చిన్న విషయము గాని, బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి, ఇతరుల కెట్టి బాధయు కలుగకుండ నిత్యజీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించెను. ఆనాటినుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని యెంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగత రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే యెల్లప్పుడు తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులయందు గలరని తెలిసి కొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు.

బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తియందుంచుకొనిరి. ఆమెను మరచెదరెట్లు? బాబా తమ భౌతిక శరీరమును విడుచునపుడు, తన జేబులో చేయిపెట్టి యొకసారి 5 రూపాయలు, యింకొకసారి 4 రూపాయలు మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయి కిచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయములోని నవవిధభక్తులను తెలియజేసెను. లేదా ఇది సిమోల్లంఘన సమయమున నిచ్చు దక్షిణ యనుకొనవచ్చును. లక్ష్మీబాయి శిందే ధనవంతురాలగుటచే నామెకు ధనమవసరములేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధభక్తులను గూర్చి బోధించియుండవచ్చును. భాగవతము ఏకాదశస్కంధమందు దశమాధ్యాయములో ఆరవశ్లోకమున పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడియున్నది. బాబా ఈ ప్రకారముగ మొదట 5, తదుపరి 4 మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఒక తొమ్మిదేకాక తొమ్మిదికి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతిమీదుగా వ్యయమైనవి. కాని బాబా యిచ్చిన ఈ తొమ్మిది రూపాయల నామె యెన్నటికిని మరువదు.

మిక్కిలి జాగురూకత మరియు పూర్ణచైతన్యము కలిగియుండు బాబా అవసానకాలమందు కూడ జాగ్రత్త పడెను. తన భక్తుల పై గల ప్రేమానురాగములయందు తగుల్కొనకుండునట్లు, వారందరిని లేచిపొమ్మనెను. కాకాసాహెబు దీక్షిత్, బాపుసాహెబు బుట్టీ మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాను గనిపెట్టుకొనియుండిరి. కాని బాబా వారిని వాడాకు బోయి భోజనము చేసి రమ్మనెను. వారు బాబాను విడువలేకుండిరి; బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికి వారు పోలేక పోలేక మసీదు విడిచి పొయిరి. బాబా స్థితి యపాయకరముగా నుండెనని వారికి దెలియును. కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చిండిరే కాని వారి మనస్సు ఎక్కడనో బాబాపై నుండెను. వారు భోజనము పూర్తిచేయక మునుపే బాబా తమ భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చెను. భోజనములను విడిచి యందరు మసీదుకు పరుగెత్తిరి. బాయాజీ తొడపై బాబా వ్రాలి యుండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా గూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరమును విడిచిరి. యోగులు శరీరము ధరించి యేదో పనిమీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదిరెండవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

నలుబదియొకటవ ఆధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నలుబదియొకటవ ఆధ్యాయము

1. చిత్రపటము యొక్క వృత్తాంతము, 2. గుడ్డపేలికలను దొంగిలించుట, 3. జ్ఞానేశ్వరి పారాయణము.

గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ ఆధ్యాయములో చిత్రపటముయొక్క వృత్తాంతమును జెప్పెదము.

గత ఆధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరముల తదుపరి అలీ మహమ్మద్ హేమద్పంతును కలిసి ఈ దిగువ కథ నతనికి జెప్పెను.

యొకనాడు బొంబాయి వీధులలో బొవునపుడు, వీధిలో తిరిగి యమ్మువానివద్ద అలీమహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి, తన బాంద్రా యింటిలో గోడకు వ్రేలాడ వేసెను. యతడు బాబాను ప్రెమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమడ్పంతుకు ఆ పటమిచ్చుటకు 2 (౨) నెలల ముందు యతడు కాలుమీద కురుపులేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడతడు బొంబాయిలోనున్న తన బావమరిది యగు నూర్ మహమ్మద్ పీర్ భాయి యింటిలో పడియుండెను. బాంద్రాలో తన యిల్లు మూడుమాసములవరకు మూయబడియుండెను. యక్కడ యెవ్వరును లేకుండిరి. అచ్చట ప్రసిద్ధిజెందిన అబ్దుల్ రహిమాన్ బాబా, మౌలానాసాహెబు మహమ్మద్ హుసేను, సాయిబాబా, తాజుద్దిన్ బాబా మొదలగు (సజీవ) యోగుల పటము లుండెను. వానిని కూడ కాలచక్రము విడువలేదు అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో యా పటములేల బాధపడవలెను? పటములకు గూడ చావుపుట్టుక లున్నట్లుండెను. పటములన్నియు వాని వాని యదృష్టము లనుభవించెను గాని సాయిబాబా పటము మాత్రము యా కాలచక్రమును తప్పించుకొనెను. అదెట్లు తప్పించుకొనగలిగెనో నాకింతవరకు చెప్పలేరైరి. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి యనియు, సర్వవ్యాపి యనియు ననంత శక్తుడనియు దెలియుచున్నది.

అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రహిమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ తారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్ భాయికి యిచ్చెను. అది యతని టేబిల్ లో 8 (౮) సంవత్సరములు పడియుండెను. యొకనాడు అతడు జూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు దీసికొనిపోయి సజీవప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులో నొకటి అలీ మహమ్మద్ కిచ్చెను. దాని నతడు తన బాంద్రా యింటిలో బెట్టెను. నూర్ మహమ్మద్, అబ్దుల్ రహిమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో నుండగా నతడు గురువుగారికి దీనిని కానుకగా నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మదు నచటనుండి తరిమి వేసిరి. యతడు మిగుల విచారపడి చీకాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయేగాక గురువుగారి కోపమునకు, అసంతుష్టికి కారణమాయెనుగదా యని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి యిష్టము లేకుండెను. యా పటమును అపొలో బందరుకు తీసుకొని బోయి, యొక పడవను అద్దెకు గట్టించుకొని సముద్రములోనికి బోయి, దాని నక్కడ నీళ్ళలో ముంచివేసెను. తన బంధువుల వద్దనుంచి స్నేహితుల వద్దనుంచి పటములను దెప్పించి (6 (౬) పటములు) వానినికూడ బాంద్రా సముద్రములో ముంచెను. యా సమయమున అలీమహమ్మద్ తన బావమరిది యింటిలో యుండెను. యోగుల పటములను సముద్రములో పడవైచినచో తన వ్యాధి కుదురునని బావమరది జెప్పెను. యిది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ ను బాంద్రా యింటికి బంపి యక్కడున్న పటముల నన్నింటిని సముద్రములో బడివేయించెను.

రెండునెలల పిమ్మట అలీ మహమ్మద్ తన యింటికి తిరిగి రాగా బాబాపటము యెప్పటివలె గోడమీదనుండుట గమనించి యాశ్చర్యపడెను. తన మేనేజర్ పటములన్ని దీసివైచి బాబా పటము నెట్లు మరచెనో యతనికే తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్న తన బావగారు దానిని జూచినచో దానిని గూడా నాశనము చేయునని భయపడెను. దాని నెవ్వరి కివ్వవలెను? దాని నెవరు జాగ్రత్త పరచెదరు? దానిని భద్రముగా నెవరుంచగలరు? అను విషయముల నాలోచించుచుండగా, సాయిబాబాయే తనకు స్వయముగా సలహానిచ్చి మౌలానా ఇస్ము ముజాఫర్ ను కలిసి వారి యభిప్రాయము ప్రకారము చేయవలసినదని జెప్పెను. అలీమహమ్మద్ మౌలానాను గలిసికొని జరిగినదంతయు జెప్పెను. యిరువురును బాగుగా ఆలోచించి యా పటమును హేమడ్పంతు కివ్వ నిశ్చయించిరి. యతడు దానిని జాగ్రత్తపరచునని తోచెను. యిద్దరును హేమడ్పంతు వద్దకు బోయిరి. సరియైన కాలములో దానిని బహూకరించిరి.

ఈ కథను బట్టి బాబాకు భూతభవిష్యద్వర్తమానములు తెలియుననియు, చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలనెట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. యెవరికయితే ఆధ్యాత్మిక విషయములలో నెక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే గాక వారి కష్టములను దొలగించి వారిని ఆనందభరితులుగా జేయుచుండిరని రాబోవు కథవలన తెలియును.

గుడ్డపేలికలను దొంగిలించుట – జ్ఞానేశ్వరి చదువుట

బి.వి దేవు దహనులో మామలతుదారు. జ్ఞానేశ్వరిని యితర మతగ్రంథములను చదువవలెనని చాలాకాలమునుండి కోరుచుండెను. భగవద్గీతపయి మరాఠీభాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో నొక యధ్యాయమును యితర గ్రంథములనుండి కొన్ని భాగములను పారాయణ జేయుచుండెను. కాని జ్ఞానేశ్వరిని ప్రారంభించగనే ఏదో యవాంతరము లేర్పడుటచే పారాయణమాగిపోవుచుండెను. మూడు నెలల సెలవు పెట్టి, షిరిడీకి వెళ్ళి యక్కడ నుండి తన స్వగ్రామమగు పౌడుకు బోయెను. ఇతర గ్రంథములన్నియు నచట చదువగలిగెను. కాని జ్ఞానేశ్వరి ప్రారంభించగనే యేమో విపరీతమైన చెడ్డ యాలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదువలేకుండెను. యాతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదువలేకబోయెను. కాబట్టి బాబా తనకు యా గ్రంథమందు శ్రద్ధ కలుగ జేసినప్పుడే, దానిని చదువుమని వారి నోటివెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించెదననియు యంతవరకు దానిని తెరువననియు, నిశ్చయము చేసికొనెను. అతడు 1914వ (౧౯౧౪) సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబసహితముగా షిరిడీకి వెశ్ళెను. యక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాపుసాహెబు జోగ్, దేవుగారి నడిగెను. దేవు తనకు అట్టి కోరిక గలదనియు, గాని దానిని చదువుటకు శక్తి చాలకుండెననియు, బాబా యాజ్ఞాపించినచో, దానిని ప్రారంభించెదననియు జెప్పెను. అప్పుడు జోగ్, ఒక పుస్తకమును దీసికొని బాబా కిచ్చినచో, దానిని వారు తాకి పవిత్రము జేసి యిచ్చెదరనియు అప్పటినుండి నిరాటంకముగా చదువవచ్చుననియు దేవుకు సలహా నిచ్చెను. బాబాకు తన యుద్దేశము దెలియును గనుక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేడా? దానిని పారాయణ జేయుమని స్పష్టముగా నాజ్ఞాపించలేడా? యనెను.

దేవు బాబాను దర్శించి, ఒక రూపాయి దక్షిణ నిచ్చెను. బాబా 20 (౨౦) రూపాయలు దక్షిణ యడుగగా దానిని చెల్లించెను. యానాడు రాత్రి బాలకరాముడను వానిని కలిసికొని యతడు బాబాయందు భక్తిని, వారి యనుగ్రహమును యెట్లు సంపాదించెనని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట యంతయు దెలిపెదనని యతడు బదులిచ్చెను. యా మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా యతనిని 20 (౨౦) రూపాయలు దక్షిణ యిమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండి యుండుటచే దేవు యొక మూలకు బోయి కూర్చుండెను. బాబా యతనిని బిలిచి తన దగ్గర శాంతముగా కూర్చొనమనియెను. దేవు అట్లనే చేసెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరు పోయిన తరువాత దేవు, బాలకరాముని జూచి యాతని పూర్వవృత్తాంతముతో పాటు బాబా యాతని కేమేమి జెప్పెనో, ధ్యానము నెట్లు నేర్పిరో యని యడుగగా బాలకరాముడు వివరములు జెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠురోగభక్తుని బంపి, దేవును తీసికొని రమ్మనెను. దేవు బాబా పద్దకు బోగా నెవరితో యేమి మాట్లాడుచుంటివని బాబా యడిగెను. బాలకరామునితో మాట్లాడుచుంటి ననియు, బాబా కీర్తిని వినుచుంటిననియు యతడు చెప్పెను. తిరిగి బాబా యిరుబది యయిదు (౨౫) రూపాయలు దక్షిణ అడిగెను. వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలకు దీసికొనిపోయి స్తంభమువద్ద కూర్చుండి “నా గుడ్డ పేలికలను నాకు దెలియకుండ దొంగిలించితివేల?” యనెను. దేవు తనకు ఆ గుడ్డ పేలికలగూర్చి యేమియు తెలియదనెను. బాబా యతనిని వెదకు మనెను. అతడు వెదకెను. కాని యచ్చట యేమియు దొరకలేదు. బాబా కోపగించి యిట్లనెను. “ఇక్కడ యింకెవ్వరు లేరు. నీ వొక్కడివే దొంగవు. ముసలితనముచే వెండ్రుకలు పండినప్పటికిని యిచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా?” యని కోపగించెను. బాబా మతి చెడిన వానివలె తిట్టి కోపగించి చీవాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో యను కొనెను. ఒక గంట తరువాత బాబా యతనిని వాడాకు వెళ్ళు మనెను. దేవు అచటికేగి జరిగినదంతయు జోగుకు, బాలకరామునకు దెలియజేసెను. సాయంకాల మందరిని రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యముగా దేవును రమ్మనెను, “నా మాటలు వృద్ధుని బాధించి యుండవచ్చునుగాని, యతడు దొంగిలించుటచే నేనట్లు పలుకవలసి వచ్చె” నని బాబా నుడివెను. తిరిగి బాబా పదిరెండు (౧౨) రూపాయలు దక్షిణ యడిగెను. దేవు దానిని వసూలుచేసి చెల్లించి, సాష్టాంగనమస్కారము జేసెను. బాబా యిట్లనెను. “ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము. పోయి వాడాలో కూర్చుండుము. ప్రతినిత్యము కొంచమైనను క్రమము తప్పక చదువుము. చదువునపుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో భోధపరచి చెప్పుము. నేను నీకు జాల్తారు సెల్లానిచ్చుటకు ఇచట కూర్చొనియున్నాను. ఇతరులవద్దకు పోయి దొంగిలించెదవేల? నీకు దొంగతనమునకు అలవాటు పడవలెనని యున్నదా?”

బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించుమని యాజ్ఞాపించెననియు, తనకు కావలసినదేదో యది దొరికె ననియు, యప్పటినుండి తాను సులభముగా చదువగల ననియు యనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్ఠాంగనమస్కారమొనర్చెను. తాను శరణువేడెను. కనుక తనను బిడ్డగా నెంచి, జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పేలికలు దొంగిలించుట యనగా నేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డపేలికలు దొంగిలించుట. బాబాకట్టి వైఖరి యిష్టము లేదు. యే ప్రశ్నకైనా సమాధానము యిచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి. యితరుల నడుగుట బాబాకు యిష్టములేదు. అందుచే నతని బాధించి చీకాకు పెట్టెను. అదియునుగాక యితరుల నడుగకుండ బాబానే సర్వము యడిగి దెలిసికొనవలెననియు, నితరుల ప్రశ్నించుట నిష్ప్రయెజనమనియు జెప్పెను. దేవు యా తిట్లను పువ్వులు, అశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి బోయెను.

యా సంగతి యంతటితో సమాప్తి కాలేదు. చదువుమని యాజ్ఞాపించి బాబా యూరుకొనలేదు. యొక సంవత్సరము లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని యభివృద్ధిని కనుగొనెను. 1914వ (౧౯౧౪ వ) సంవత్సరము ఏప్రిల్ నెల రెండవ (౨ వ) తేదీ గురువారము ఉదయము బాబా స్వప్నములో సాక్షాత్కరించి పై అంతస్తులోకూర్చుండి “జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా?” యని యడిగెను. “లేదు” యని దేవు జవాబిచ్చెను.

బాబా: ఇంకా యెప్పుడు దెలిసికొనెదవు?
దేవు కండ్ల తడిపెట్టుకొని “నీకృపను వర్షింపనిదే పారాయణము చీకాకుగా నున్నది, బోధపడుట చాల కష్టముగా యున్నది. నేను దీనిని నిశ్చయముగా జెప్పుచున్నాను.” యనెను.
బాబా: చదువునపుడు, నీవు తొందరపడుచున్నావు. నాముందర చదువుము. నా సమక్షమున చదువుము.
దేవు: యేమి చదువవలెను?
బాబా: యాధ్యాత్మ చదువుము.
పుస్తకమును దీసికొని వచ్చుటకు దేవు వెళ్ళెను. యంతలో మెలకువ వచ్చి కండ్లు తెరచెను. యీ దృశ్యమును జూచిన పిమ్మట దేవు కెంత యానందము, సంతోషము కలిగెనో చదువరులే గ్రహింతురు గాక!

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదియొకటవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

నలుబదియవ అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నలుబదియవ అధ్యాయము

బాబా కథలు

1. దేవుగారి యింటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి యిద్దరిని తోడ్కోని పోవుట. 2. హేమాడ్ పంతు ఇంటికి ఫోటో రూపములో పోవుట.

ఈ యధ్యాయములో రెండు కథలు చెప్పుదుము. 1. దహనులో బి.వి. దేవుగారింటికి వారి తల్లి యాచరించిన ఉద్యాపనపత్రమునకు బాబా వెళ్ళుట. 2. బాంద్రాలోని హేమాడ్ పంతు ఇంటికి హోళీ పండుగనాడు భోజనమునుకు పోవుట.

తొలిపలుకు

శ్రీ సాయిసమర్ధుడు, పావనమూర్తి. తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాల నిచ్చి జీవితపరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తులయెడ భేదము లేక నమస్కరించిన వారిని కౌగిలించుకొనువారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రమువలె బాబా భక్తులతో కలసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనినిబట్టి, యెవరయితే భగవద్ భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారికంటెగాని, యంతకంటె యెక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదుము.

దేవుగారింట ఉద్యాపనపత్రము

దహనులో బి.వి. దేవుగారు మామలతదారుగా నుండెను. వారి తల్లి 25, 90 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి యుండెను. ఈ కార్యములో 100, 200 బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి యుండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాపు సాహెబుజోగ్ గారికి కొక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయ వలయుననియు, వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియు వ్రాసెను. జోగ్ ఆ యుత్తరము చదివి బాబాకు వినిపించెను. మనః పూర్వకమయిన విజ్ఞాపనను విని బాబా యిట్లనియె. “నన్నే గురుతుంచుకొను వారిని నేను మరువను. నాకు బండిగాని, టాంగాగాని, రైలుగాని, విమానముగాని యవసరములేదు. నన్ను ప్రేమతో బిలచువారియొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్ష్యమయ్యెదను. అతనికి సంతోషమయిన జవాబు వ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చెదమని వ్రాయుము.” జోగ్ బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగా రెంతో సంతసించిరి. కాని బాబా రాహాతా, రుయి, నీమగాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియును. బాబాకు అశక్యమైన దేమియు లేదు. వారు సర్వాంతర్యామి యగుటచే హఠాత్తుగా నేరూపమున నయిన వచ్చి, తమ వాగ్ధానమును పాలించ వచ్చు ననుకొనెను.

ఉద్యాపనకు కొద్దిరోజులు ముందుగా, బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి యొకడు గోసంరక్షణకయి సేవచేయుచు దహను స్టేషన్ మాస్టరు వద్దకు చందాలు వసూలుచేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు, ఊరి లోనికి పోయి మామలతదారుని కలిసికొని వారి సహాయముతో చందాలు వసూలు చేయుమనెను. అంతలో మామలతదారే యచ్చటికి వచ్చెను. స్టేషను మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయమొనర్చెను. ఇద్దరు ప్లాట్ ఫారమ్ మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు, ఊరిలో నేదో మరొక చందాపట్టి రావుసాహెబు నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే, నింకొకటి యిప్పుడే తయారుచేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి యచటనుండి పోయెను. ఒకనెల పిమ్మట యా సన్యాసి యొక టాంగాలో వచ్చి, 10 గంటలకు దేవుగారి యింటిముందర ఆగెను. చందాల కొరకు వచ్చెనేమోయని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై యుండుట జూచి, తాను చందాలకొరకు రాలేదనియు భోజనమునకై వచ్చితిననియు సన్యాసి చెప్పెను. అందుకు దేవు “మంచిది; చాల మంచిది, మీకు స్వాగతము. ఈ గృహము మీదే” యనెను. అప్పుడు సన్యాసి “ఇద్దరు కుర్రవాళ్ళు నాతో నున్నారు.” యనెను. దేవు: “మంచిదే, వారితో కూడ రండు,” అనెను. ఇంకా రెండుగంటల కాలపరిమితి యుండుటచే, వారికొరకు ఎచ్చటికి పంపవలెనని యడిగెను. సన్యాసి ఎవరిని బంపనవసరము లేదనియు తామే స్వయముగా వచ్చెదమనియు చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి.

ఉద్యాపన పూర్తికాగానే దేవుగారు బాపుసాహెబు జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను. జోగు ఉత్తరము తీసికొని బాబావద్దకు వెళ్ళెను. దానిని తెరువక మునుపే బాబా యిట్లనెను. “హా! వాగ్దానము చేసి, దగా చేసితిననుచున్నాడు. ఇద్దరితో కూడ నేను సంతర్పణకు హాజరయితిని, కాని నన్ను పోల్చుకొనలేకపోయెనని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేల? సన్యాసి చందాల కొరకు వచ్చెనని యనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చెదనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి యారగించలేదా? నామాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైన విడిచెదను. నామాటలను నేనెప్పుడు పొల్లు చేయను.” ఈ జవాబు జోగ్ హృదయంలో నానందము కలుగ జేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదువగనే దేవుకు ఆనందబాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటిరాకచే తానెట్లు మోసపోయెనో; సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలసి భోజనమునకు వచ్చెదనను అతని మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట – మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను.

భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో, వారు తమ భక్తుల యిండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు జూచెదరు అనునది యీ కథవల్ల స్పష్టపడుచున్నది.

హేమాడ్ పంతు ఇంట హోళీపండుగ భోజనము

ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము.

1917వ సంవత్సరము హోళీ పండుగనాడు వేకువజామున హేమాడ్ పంతు కొక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసివలె బాబా గాన్పించి, నిద్రనుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చెదనని చెప్పెను. ఇట్లు తనను నిద్రనుండి లేపినది కూడ కలలోని భాగమే. నిజముగా లేచి చూచుసరికి సన్యాసిగాని, బాబా గాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు దెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతిమాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబాగారి సహవాసము ఏడు సంవత్సరములనుండి యున్నప్పటికి, బాబా ధ్యానము నెల్లప్పుడు చేయుచున్నప్పటికి, బాబా తన యింటికి వచ్చి భోజనము చేయునని అతడనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్యవద్దకు బోయి ఒకసన్యాసి భోజనమునకు వచ్చును గాన, కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పెను. ఆది హోళీ పండుగదినము. వచ్చువారెవరని, ఎక్కడనుండి వచ్చుచున్నారని యామె యడిగెను. ఆమె ననవసరముగా పెడదారి పట్టించక ఆమె యింకొక విధముగా భావింపకుండునట్లు, జరిగినది జరిగినట్లుగా చెప్ప నెంచి, తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి మంచి పిండివంటలను విడిచి బాబా తనవంటివా రింటికి బాంద్రాకు వచ్చునాయని, యామెకు సంశయము కలిగెను. అందులకు హేమాడ్ పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు, కాని ఎవరినైన బంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనెను.

మధ్యాహ్నభోజనమునకై ప్రయత్నము లన్నియు చేసిరి. మిట్టమధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యెను. హోళీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి. ముగ్గులు పెట్టిరి. భోజనమునకు రెండు పంక్తులు తీర్చిరి, రెండింటిమధ్య నొక పీట బాబాకొరకమర్చిరి, గృహములోని వారందరు కొడుకులు, మనుమలు, కొమార్తెలు, అల్లుళ్ళు మొదలగువారందరు వచ్చి వారి వారి స్థలముల నలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరు అతిథికొరకు కనిపెట్టుకొనియుండిరి. 12 గంటలు దాటినప్పటికి ఎవరు రాలేదు. తలుపు వేసి గొండ్లెము పెట్టిరి. అన్నశుద్ధి యయ్యెను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుట కిది యొక గుర్తు; అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరు భోజనము ప్రారంభింపబోవుచుండగా, మేడ మెట్లపై చప్పుడు వినిపించెను. హేమాడ్ పంతు వెంటనే పోయి తలుపుతీయగా ఇద్దరు మనుష్యులచట నుండిరి. 1. అలీమహమ్మద్, 2. మౌలానా ఇస్ముముజాఫర్. ఆ యిరువురు, వడ్డన మంతయు పూర్తియై అందరును భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించుమని కోరియిట్లు చెప్పిరి. “భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకొని వచ్చితివి. తక్కినవారు నీ కొరకు చూచుచున్నారు. కావున, ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు దెలిపెదము.” అట్లనుచు తమ చంకలోనుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబిల్ పైన బెట్టిరి. హేమాడ్ పంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దది యగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరగెను, కండ్లనుండి నీరు కారెను, శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా యీ విధముగా తన లీలచే ఆశీర్వదించెనని యనుకొనెను. గొప్ప యాసక్తితో నీకా పటమెట్లు వచ్చెనని అలీమహమ్మద్ ను అడిగెను. అతడా పటమొక యంగడిలో కొంటిననియు, దానికి సంబంధించిన వివరము లన్నియు తరువాత తెలియజేసెద ననెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకొని యుండుటచే త్వరగా పొమ్మని యనెను. హేమాడ్ పంతు వారికి అభినందనలు తెల్పి భోజనశాలలోనికి బోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపయి బెట్టి వండిన పదార్థములన్నియు వడ్డించి, నైవేద్యము పెట్టినపిమ్మట అందరు భుజించి, సకాలమున పూర్తి చేసిరి. పటములో నున్న బాబా యొక్క చక్కని రూపును జూచి యందరు అమితానందభరితు లయిరి. ఇదంతయు నెట్లు జరిగెనని యాశ్చర్యపడిరి.

ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నములో జెప్పినమాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా నది అలీమహమ్మదు కెట్లుదొరికెను? అత డెందుకు తెచ్చెను? దానిని హేమాడ్ పంతు కెందు కిచ్చెను? అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకొందుము.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదియవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।